న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్పై స్టార్ షట్లర్ గుత్తా జ్వాల సంచలన ఆరోపణలు చేసింది. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో జ్వాల ఈ విమర్శలు చేసింది. గోపీచంద్ తన పట్ల పక్షపాతంగా వ్యవహరించే వాడని, ఏ దశలోనూ అండగా నిలిచే వాడు కాదని విమర్శించింది. తన కెరీర్ను దెబ్బ తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని ఆరోపించింది. గోపీచంద్ వల్లే తాను కెరీర్లో ఆశించిన విజయాలు సాధించలేక పోయానని వాపోయింది. గోపీచంద్ వ్యవహరించిన తీరుతో తనకు తగినన్ని అవకాశాలు లేకుండా పోయాయని విమర్శించింది.
మిక్స్డ్ డబుల్స్లో తాను ఎంతో మెరుగైన ప్రతిభను కనబరిచినా కోచ్గా గోనీ తనకు ఏ మాత్రం సహకరించలేదని ఆరోపించింది. ముక్కు సూటిగా మాట్లాడడమే తనకు శాపంగా మారిందని చెప్పింది. నా కెరీర్లో ఎదుర్కొన్న వేధింపులకు కచ్చితంగా గోపీచందే ప్రధాన కారణమని, ఈ మాటకు తాను కట్టుబడి ఉన్నానని జ్వాల స్పష్టం చేసింది. సైనా, సింధు, శ్రీకాంత్ తదితరులకు అండగా నిలిచిన గోపీ తన పట్ల పూర్తిగా నిర్లక్షం వహించాడని ఆవేదన వ్యక్తం చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనను ఆడించకుండా ఇతర రాష్ట్రాల షట్లర్లకు ప్రాధాన్యత ఇచ్చేవాడని విమర్శించింది. కోచ్గా అందరిని సమానంగా చూడాల్సిన గోపీచంద్ కొందరికే మద్దతుగా నిలిచి తనలాంటి వారి కెరీర్ను పూర్తిగా దెబ్బ తీశాడని జ్వాల వాపోయింది.