నాగపూర్ : మన వాటా నీళ్లు పాకిస్థాన్కు వెళ్లకుండా నిలిపి వేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దాంతో, జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్కు నీళ్లు అందుతాయని ఆయన తెలిపారు. గుజరాత్ జనసంసద్ ర్యాలీనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గడ్కరీ మాట్లాడారు. అవిభక్త భారత్ నుంచి విడిపోతున్నపుడు రెండు దేశాలకు మూడేసి నదుల చొప్పున వాటాగా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. మన వాటా నీళ్లు కూడా పాకిస్థాన్కు వెళ్తున్నాయని ఆయన తెలిపారు. వాటి గురించి 1970 నుంచి ఎవరూ మాట్లాడలేదని ఆయన అన్నారు. తాను జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, పంజాబ్ సిఎం అమరీందర్సింగ్లతో ఈ విషయమై ఒప్పందం జరగాలంటూ ప్రతిపాదించానని గడ్కరీ తెలిపారు. ఈ నదుల మీద నిర్మించే 9ప్రాజెక్టుల్లో ఏడింటిపై గతంలో ఏకాభిప్రాయం లేదని, ఇప్పుడు ఆ దిశగా ముఖ్యమంత్రులు ఓ పరిష్కారానికి వచ్చే సూచనలున్నట్టు ఆయన తెలిపారు.