Saturday, April 27, 2024

భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద నీరు..

- Advertisement -
- Advertisement -

గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుండి వచ్చే వరదల వల్ల ఈ రోజు రాత్రికి భద్రాచలం వద్ద 35 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 2.35 లక్షలు, ఇంద్రావతి నది నుండి 2.15 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల కారణంగా ఈ రోజు ఉదయం పేరూరు వద్ద 5.3 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే తాలిపేరు ప్రాజెక్టు నుండి విడుదల విడుదల చేసిన 60 వేలు క్యూసెక్కులతో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి 35 అడుగులకు చేరే అవకాశం ఉన్నదని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామ, మండల అలాగే జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. పొంగి పొర్లే వాగులు, వంకలు, జలాశయాలను వీక్షించేందుకు ప్రజలు వెళ్లకుండా బారికేడింగ్ తో నియంత్రణ చేయాలని రాకపోకలు నిలిపి వేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. రహదారుల పైకి నీరు వచ్చిన ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపి వేయాలని ప్రమాద హెచ్చరికల బోర్డులు పెట్టాలని చెప్పారు. రహదారులపై ఎక్కడైనా చెట్లు పడితే తక్షణమే తొలగించాలని చెప్పారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను చెప్పారు.

అత్యవసర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08744-241950, వాట్సప్ నంబర్ 9392919743కు మెసేజ్ కానీ వీడియో కానీ చేయాలని చెప్పారు. కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయంలో 9392919750, భద్రాచలం ఆర్డిఓ కార్యాలయంలో 08743-232444 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 24 గంటలు పని చేయు విధంగా ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. వర్షాలు వల్ల వాగులు, జలాశయాల్లో భారీగా నీరు చేరుతున్నదని అందువల్ల పశువులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నదని, మేతకు బయటకు వదలకుండా ఇంటి వద్దనే ఉంచే విధంగా రక్షణ చర్యలు చేపట్టాలని ఆమె పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పారు. జలాశయాలు వద్ద గజ ఈత గాళ్లను, నాటు పడవలు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయిస్ లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. అత్యవసర సేవలకు ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని వారి సేవలు వినియోగించుకోవాలని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News