Monday, April 29, 2024

ఇక 24 గంటలు మంచి నీళ్లు

- Advertisement -
- Advertisement -

సరికొత్త స్కీం తెస్తాం… నయా రికార్డు సృష్టిస్తాం

30న తమాషా జరగబోతోంది… ప్రజలు మాతోనే ఉన్నారు
ఉద్యమకారులను బలి తీసుకుంది కాంగ్రెస్సే

కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/కరీంగనగర్ బ్యూరో/చొప్పదండి/జమ్మికుంట/వరంగల్లు బ్యూరో (పరకాల): రాష్ట్రంలోని రైతన్నలకు ఉచితంగా 24 గంటలపాటు సాగుకు విద్యుత్‌ను ఇస్తూ రికా ర్డు సృష్టించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి ఇంటికీ 24 గంటల తాగునీటిని సరఫరా చేసే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నామని ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖర్ రావు అన్నారు. ఎప్పుడు నల్లా తిప్పితే అప్పుడు తాగునీరు వచ్చే విధంగా మంచినీళ్ల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆ దిశగా ప నులు కూడా జరుగుతున్నాయని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ శుక్రవారం కరీంనగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రకటించారు. 24 గంటల నల్లా నీళ్లు ఇచ్చి సరికొత్త రికార్డును సృష్టించబోతున్నామని, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత కూడా బిఆర్‌ఎస్ పార్టీదే కదా కెసిఆర్ అన్నారు. గతంలో ఎవరన్నా చేసిండ్రా ప్రశ్నించారు. ప్రజల్లో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు ఎ న్నో అభివృద్ధి పనులు చేపట్టినం, ఎవ్వరు ఏమన్నా.. ఎవరు మొత్తుకున్నా.. ఎవరు ఏడ్చి నా… డెఫినెట్‌గా మళ్లా బిఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తది… హామీ ఇచ్చినట్లుగా 24 గంటల నల్లా నీళ్ళు ఇచ్చి తీరుతం ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

బిజెపికీ మత పిచ్చి తప్ప వేరే ఏ మీ రాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటి కూడా ఇయ్యలేదని ధ్వజమెత్తారు. 50 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత కరీంనగర్ జిల్లాలో ఒక్క గవర్నమెంట్ కాలేజీ కూడా రాలేదని, కానీ బిఆర్‌ఎస్ పాలనలో నా లుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినయ్ అని సిఎం కెసిఆర్ అన్నారు. కేంద్రంలోని బి జెపి ప్రభుత్వం తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాలను కూడా ఇవ్వలేదని, అందుచేత ప్ర జలు బిజెపికి ఒక్క ఓటు కూడా వేయవద్దని ప్రజలను  కోరారు. కరీంనగర్‌లో ప్రజలు చైతన్యవంతులని..ఓటు వేసేటప్పుడు ఆగం ఆగం కావద్దని..ఆలోచించి వేటువేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. 75 ఏండ్ల తర్వాత కూడా ప్రజాస్వామ్యంలో పరిణతిరాలేదని, ప్రజాస్వామ్యంలో పరిణితి వచ్చిన దేశాలు ముందుకు పోతున్నాయన్నారు. మన దగ్గర ఎన్నికలు అనగానే హడావుడి, హంగామా, అభాండాలు, గాడిద, గుర్రం ఒక్కటై పని చేస్తాయి అన్నారు. గందరోగోళం చేస్తారు. ఫాల్తు వాగ్దానాలు, అవి నెరవేర్చకపోవడం, గెలవడానికి అనేక దుర్మార్గమైన పనులు, ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు.

ప్రజాస్వామ్య పరిణితి వచ్చిన చోట ఇవి జరగవు అని గుర్తు చేశారు. అమెరికాలో మనం పెట్టినట్టు సభలు కూడా పెట్టరు. టీవీల ద్వారా మెసేజ్ ఇస్తారు, ప్రభుత్వ పాలసీల మీదనే ఓటింగ్ వేస్తరు, అలాంటి పరిణితి రాకపోతే దేశం ముందుకు పోదన్నారు. కరీంనగర్ ప్రజలు విజ్ఞులు కాబట్టి ఆలోచించి ఓటేస్తారని మనవి చేస్తున్నా అన్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో హిందూ మతం పేరిటి బిజెపి పంచాయితీలు పెడుతున్నదని ముఖ్యమంత్రి కెసిఆర్ నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు బిజెపికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కులాలు, మతం పంచాయితీ, కొట్లాట, తాకులాటలు పెట్టడం రాజకీయం అంటారా..? అన్ని వర్గాల ప్రజలు కులం, మతం అనే తేడా లేకుండా కలిసి బతకాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి మనోడు.

అందుకే ప్రగతిశీల పద్ధతుల్లో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నది ఎవరు..? ఈ రాష్ట్ర విచ్చిత్తికి ప్రజానీకాన్ని డివైడ్ చేసి స్వార్థ రాజకీయం కోసం పాకులాడుతున్నది ఎవరో గమనించాలి. కరీంనగర్‌లో ఈసారి బిజెపికి కర్రుకాల్చి వాత పెట్టాలని అప్పీల్ చేస్తున్నాం అని కెసిఆర్ అన్నారు. ఇంత చైతన్యం ఉన్న ప్రాంతం.. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కరీంనగర్ ప్రజలు బిజెపికి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. లేదంటే పిచ్చోళ్లు మాకే ఓట్లేస్తరు అని అనుకుంటారు, అలసత్వం వస్తది అని కెసిఆర్ అన్నారు. బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ ఎంపిగా ఉన్నప్పుడు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉంది..? వాళ్ల సంస్కారం, మాటలు, పద్ధతి ఏంది..? ఎంపి వినోద్ ఉన్నప్పుడు కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీలో పెట్టించారు అన్నారు. ఇప్పుడు స్మార్ట్ లేదు.. నా బోట్ లేదు.. వట్టిదే బొబ్బ.. మసీదులు తవ్వుదామా.. గుళ్లు తవ్వుదామా.. మసీదులు తవ్వేటోడు సిపాయా ఈ దేశంలో.. మసీదులు తవ్వడం సంస్కారం ఉన్నోడు చేసే పనేనా..? అని కెసిఆర్ నిప్పులు చెరిగారు. కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ ను భారీ మెజార్టీతో గెలిపించి మళ్లీ అసెంబ్లీకి పంపాలని కరీంనగర్ ప్రజలను కోరారు.

పైరవీకారులు, దళారీలు, భూకబ్జాల దందాతో కాంగ్రెస్ వస్తుంది..దయచేసి రైతులు అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్య మంత్రి కెసిఆర్ సూచించారు. ధరణి పోర్టల్ ద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. రైతుబంధు డబ్బులు ధరణి పోర్టల్ ద్వారా మీ ఖాతాలో వచ్చి పడుతున్నాయి అన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధరణి రద్దు చేస్తామని మాట్లాడుతోందని, ధరణి రద్దు చేస్తే అడ్డగోలుగా లంచాలు, పైరవీకారులు, దళారులు. వస్తారని అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి, మళ్లా పైరవీకారులు, దళారులు.. మళ్లీ మొదటికి వస్తది అని కెసిఆర్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ. 200 పెన్షన్ ఇచ్చారు. మనం రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్నాం. సంపద పెరగడంతో పెన్షన్లు పెంచుకుంటూ పోతున్నాం అన్నారు. భారతదేశ చరిత్రలోనే మానవ దృక్పథంతో గుర్తించి పెన్షన్ వేల రూపాయలు చేసింది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే.

కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇక్కడొచ్చి డైలాగులు కొడుతున్నారని అ న్నారు. ఇవాళ కూడా అనేక రాష్ట్రాల్లో 600, 700 పెన్షన్ ఇస్తున్నారు, కంటి వెలుగు ద్వారా 80 లక్షల మందికి ఉచితంగా కండ్లద్దాలు పంపిణీ చేశాం అన్నారు. వడ్లు పండించడంలో తెలంగాణ పంజాబ్ను దాటిపోయి దేశంలో నంబర్ వన్ అయిందని కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. పంటలు దిగుబడి పెంచి, ఆదాయం పెంచి పేదలను ఆదుకుంటూ ముందుకు పోతుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డు పడుతున్నాదరని అన్నారు. ఎవడు ఏది అన్నా.. ఎవడు ఏడ్సినా.. డెఫినెట్గా బీఆర్‌ఎస్ గవర్నమెంటే వస్తదని, మనం ప్రజలతో ఉన్నాం..ప్రజలు మనతో ఉన్నారు..30న తషామా చూపెడుతారు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దానికి పైసా మందం కూడా రందీ పడాల్సిన అవసరం లేదన్నారు.

బిజెపికి ఎందుకు ఓటెయ్యాలి?
జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు రాయేదో రత్నమేదో తెలుకోవాలని కెసిఆర్ సూచించారు. ఎమ్మెల్యేగా గెలువగానే కథ అయిపోయిందని అనుకోవద్దని, అసలు కథ ఇక ముందుంది అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం నాతో కలిసి అందరు మనస్పూర్తిగా పోరాడారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్, బిజెపి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని ఒక్కసారి ఆలోచించి ఓటువేయాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన 25వేల కోట్ల రూపాయలు ఇవ్వని బిజెపికి మనం ఓటు ఎందుకు వేయాలి అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పనిలేక రైతుబంధు ఇస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. రాహులు, బట్టి విక్రమార్కలు ధరణి పేరు మార్చి దానికి భూమాత పేరు పెడుతారట అది మీరే ఆలోచించాలని సూచించారు. బిజెపి పార్టీ మెడమీద కత్తిపెట్టి మోటర్లకు మీటర్లు పెట్టాలని చూసిన ఆ పార్టీకి మనం ఓట్లు ఎందుకు వేయాలి అని నిలదీశారు. బీజేపీకి ఓటేస్తే ఏం చేశారో ఈటల రాజేందర్ గెలిచి రెండేళ్లు గడిచినప్పటికీ ఒక్క పనిచేశారా మీరే ఆలోచన చేయాలని సూచించారు. రాష్ట్రంలో 100కు 100శాతం బిఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందన్నారు. ఈటల రాజేందర్ కన్నముందే ఇక్కడ పాడి సాయినాథ్ పార్టీ జెండా మోసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒక్కసారి పాడి కౌశిక్‌రెడ్డిని గెలిపించాలని, తర్వాత పనులు ఏమి ఉన్న చేసే బాధ్యత మాదేనన్నారు. గతంలో ఒక్కసారి బిజెపి అభ్యర్థికి ఓటు వేసి నన్ను బాధపెట్టారు ఎలాంటి తప్పిదం మరోసారి చెయ్యరని అనుకుంటున్నాను అని కెసిఆర్ అన్నారు.

పేదల సంక్షేమానికి పెద్దపీట
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందంటూ సిఎం కెసిఆర్ అన్నారు. గంగాధర మండల కేంద్రంలో నిర్వహించిన చొప్పదండి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. బిఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, ప్రజల సంక్షేమానికి న్యాయం చేయడానికి అన్నారు. పేదల కోసం కంటి వెలుగు, కెసిఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి బృహత్తర పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటువంటివి ఎన్నో బృహత్తరమైన పథకాలు అమలు చేస్తున్నామని, ఏపార్టీ చరిత్ర ఏంటి అనే విషయాలను ప్రజలు చూడాలన్నారు. రాష్ట్రంలో 7500 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవస్థ పడకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయడం జరిగిందని అన్నారు. వరద కాలువలు సజీవంగా చేసుకుని తూ ముల ఏర్పాటుతో నీళ్లను అందిస్తున్నామన్నారు. ఒటిలు, వరద కాలువ ఏర్పాటుతో చొప్పదండి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనే అత్యధిక పంటల సా గుబడి అవుతుందని, అధిక పంటలు, దిగుబడి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటేస్తే మూడు గంటల కరెంట్ అందిస్తామని, 10 హెచ్‌పీల మోటార్లు పెట్టుకోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని, 24 గంటల కరెంట్ కావాలో, మూడు గంటల కరెంట్ కావాలో ప్రజలు తెల్చుకోవాలని సీఎం కెసిఆర్ సూచించారు. ప్రజలు తాగునీటి కోసం అవస్థ పడకుండా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల ద్వారా భూగర్భ జలాల పెంపుతో పాటు తాగునీటిని అందిస్తున్నామన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో వంద పడకల ఆస్పత్రి సెంట్రల్ లైటింగ్ సిస్టంతో పాటు అనేక అభివృద్థి పనులు జరిగాయన్నారు. ప్రజలు కోరిక మేరకు గంగాధర మండలం గర్శకుర్తి, రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిఒను తీస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. చొప్పదండి బిఆర్‌ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇక్కడ ఏ అభ్యర్థి గెలిస్తే ప్రభుత్వం కూడా అదే వస్తుందన్నారు. కొండగట్టు అంజన్న కొలువుదీరిన ప్రాంతమని, కొండగట్టు అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలనైనా వెచ్చిస్తామన్నారు.

కాంగ్రెస్‌ను నమ్మితే అరిగోస పడతం
పరకాల: ఇప్పుడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని నమ్మితే అరిగోస పడడం ఖాయం అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి 1969 తెలంగాణ ఉద్యమంలో 400 మంది బలిదానామయ్యారు. మలి దశ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులయ్యారు. సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ప్రత్యేక రాష్ట్రం కోసం దేశంలోని 33 రాష్ట్రాలు మద్దతిస్తే కాంగ్రెస్ దిగి వచ్చిందని కెసిఆర్ చెప్పారు. రాష్ట్రాన్ని 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ సాగునీరు, తాగునీరు, కరెంట్, ఉపాధిని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి స్కాములు తప్పా స్కీములు తెలియదని, పొరపాటున కూడా ఆ పార్టీని నమ్మొద్దన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతుబంధును ప్రవేశపెట్ట 24 గంటల ఉచిత కరెంట్‌ను బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తుండగా కాంగ్రెస్ నాయకులు వక్ర భాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయానికి 24గంటలు కరెంట్, రైతుబంధు ఉండాలంటే బిఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ ధరణి పోతే రైతుబంధు ఎట్లా వస్తుందని ఆయన ప్రశ్నించారు. రైతుబంధు దుబారా అంటున్న కాంగ్రెస్ పార్టీని పాతరేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంట్, సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు అమలు చేయడం వలన యేటా మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని అన్నారు. నిత్యం పరకాల అభివృద్ధి కోసం పరితపించే చల్లా ధర్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News