మనతెలంగాణ/హైదరాబాద్: పవిత్రమైన రంజాన్ మాసంలో దొరికే హలీమ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అన్ని వర్గాల వారు ఈ వంటకానికి ఫిదా అయిపోతారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ అరబిక్ వంటకం ఎంతో ఫేమస్. రంజాన్ మాసంలో నెల రోజుల పాటు దొరికే రుచికరమైన హలీమ్ కోసం ముస్లింలతో పాటు పలువురికి ఈసారి నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల విధించిన లాక్డౌన్ దీనికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ రంజాన్ మాసంలో హోటళ్లు, హలీమ్ సెంటర్లు కరోనా వైరస్ కారణంగా తెరిచే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతిఒక్కరూ ఎక్కువగా ఇష్టపడే ఈ ప్రత్యేక వంటకాన్ని ఈసారి అందుబాటులో తీసుకొచ్చే అవకాశం లేదని తయారీదారులు పేర్కొంటుండడంతో హలీంను ఇష్టపడే వారు దీనిపై ఈసారి ఆశలు వదులుకోవడానికి సిద్ధమవుతున్నారు.
కబేళా మూసివేయడంతో ఇబ్బందులే
హైదరాబాద్లోని హలీమ్ తయారీదారుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహద్ అబ్దుల్ మజీద్ ఓ చానల్తో మాట్లాడుతూ హైదరాబాద్ శివార్లలోని చెంగిచర్ల ఉన్న కబేళా నుంచి నాణ్యమైన మాంసాన్ని తీసుకొస్తామని, అయితే లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది కబేళా మూసివేశారని ఆయన పేర్కొన్నారు. అంతేకాక లాక్డౌన్ వల్ల కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేశాక అందులో పనిచేసే సిబ్బంది వారి సొంతూళ్లకు వెళ్లిపోయారన్నారు. అసోసియేషన్ తరఫున మొదట స్విగ్గీ, జోమాటోల ద్వారా హోమ్ డెలివరీ ఇవ్వాలనుకున్నామని, సాయంత్రం 6 గంటల తరువాత కర్యూ ఉన్నందున సాధ్యపడదని ఆయన పేర్కొన్నారు.
Hyderabedis to miss Haleem this Ramzan due to Covid 19