కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: కరోనా నివారణ ముందు జాగ్రత్త చర్యల కోసం వ్యాధి కారక బ్యాక్టీరియాను నాశనం చేసే సోడియం హైపోక్లోరైట్ వంటి రసాయనాల (డిస్ఇన్ఫెక్టంట్స్)ను మనుషులపై స్ప్రే చేయరాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కరోనా అనుమానితులు లేదా కరోనా నిర్ధారణ రోగులు తరచుగా స్పర్శించే ఉపరితలాలు, ప్రాంతాలను పరిశుభ్రం చేయడానికి మాత్రమే ఈ రసాయనాలను ఉపయోగించాలని సిఫార్సు చేసింది. పరిశుభ్రం చేయడానికి ఈ రసాయనాలు ఉపయోగించేటప్పుడు గ్లోవ్స్ వంటివి ధరించాలని సూచించింది. వ్యక్తులపై విడివిడిగా, లేదా గుంపుల వారీగా వీటిని స్ప్రే చేస్తే భౌతికంగా, మానసికంగా హాని కలుగుతుందని హెచ్చరించింది. వ్యక్తులపై క్లోరిన్ స్ప్రే చేస్తే కళ్లు, చర్మం మండుతాయని, జీర్ణసంబంధ సమస్యలు వస్తాయని ఆరోగ్య మంత్రి త్వ శాఖ హెచ్చరించింది. సోడియం హైపోక్లోరైట్ను పీలిస్తే గొంతు,ముక్కు శ్వాస నాళం లోని పొరల్లో మంట పుడుతుందని వివరించింది.