వరల్డ్కప్ ఈసారి లేనట్టే
మెల్బోర్న్: అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయక పోయినా ఈసారి ఆస్ట్రేలియా వేదికగా వరల్డ్కప్ జరగడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఇప్పటి కే ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. దీనిపై ఇక అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది. అక్టోబర్ 18 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) కానీ, క్రికెట్ ఆస్ట్రేలియా కానీ దీనిపై ఓ స్పష్టతకు రాలేక పోతున్నాయి. పరిస్థితులను గమనిస్తే ప్రపంచకప్ వాయిదా పడడం ఖాయమనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియాలో విదేశీయుల రాకపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక, ప్రస్తుత నిబంధనల ప్రకా రం ఏ దేశంలోనైనా విదేశీయులు వస్తే వారు కనీసం రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీంతో ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు వచ్చే వారు సెప్టెంబర్ 30 తర్వాతే ఇక్కడికి రాకతప్పదు. వచ్చినవారు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండక తప్పదు. రెండు వారాల పాటు క్రికెటర్లు క్వారంటైన్లో ఉంటే కనీస ప్రాక్టీస్కు కూడా అవకాశం ఉండదు. ఇలాంటి స్థితిలో ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లో బరిలోకి దిగడం ఆయా జట్లకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇలాం టి స్థితిలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలను సడలించా ల్సి ఉంటోంది.
వరల్డ్కప్ కోసం విదేశీ క్రికెటర్లకు నెల రోజుల ముందే ఆస్ట్రేలియాకు వచ్చే అనుమతి ఇస్తేనే టోర్నీ నిర్వహణ సాధ్యమవుతోంది. ఇది జరగాలంటే ఐసిసి, క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు తీవ్రం గా ప్రయత్నించాలి. ఒకవేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మాత్రం ప్రపంచకప్ను షెడ్యూ ల్ ప్రకారం నిర్వహించడం కష్టమేమి కాదు. కానీ, పరిస్థితులు చూస్తుంటే ఇది ఆచరణలో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే కరోనా ఇంకా తగ్గు ముఖం పట్టకపోవడం, ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వరల్డ్కప్ జరగడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఒక వేళ ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా ఖాళీ స్టేడియాల్లోనే వరల్డ్కప్ నిర్వహించక తప్పదు. కాగా, ప్రేక్షకులు లేకుండా వరల్డ్కప్ వంటి మెగా టోర్నమెంట్ను నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియాకానీ, ఐసిసికానీ సాహాసం చేస్తుందనడం అత్యాశే అవుతుంది. ఇప్పటికే ఖాళీ స్టేడియాల్లో వరల్డ్కప్ నిర్వహించలేమని క్రికెట్ ఆస్ట్రేలి యా ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. అంతేగాక పలు దేశాల క్రికెట్ బోర్డులు కూడా దీనికి సిద్ధంగా లేవు. దీంతో ప్రపంచకప్ వాయిదాపడడం లాంఛనమేనని వార్తలు విని పిస్తున్నాయి. మరోవైపు ఐసిసి మాత్రం జులై 20న ప్రపంచకప్ నిర్వహణ విషయమై తుది ప్రకటన చేస్తానని ప్రకటించింది. అప్పటివరకు అందరూ వేచి చూడక తప్పదు.
ICC no decides on T20 World Cup in Australia