న్యూఢిల్లీ: కార్పొరేట్ బాండ్లలో ఎఫ్పిఐ(విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్) పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 9 శాతం నుంచి 15 శాతానికి పరిమితి పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా పెట్టుబడులను పెంచాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది. ఈమేరకు శుక్రవారం బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశం పెంచుతామని ఆర్థికమంత్రి అన్నారు.
మౌలికసదుపాయ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే రూ.22 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఎన్బిఎఫ్సి, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లలో ద్రవ్యకొరత సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించనుందని ఆమె వివరించారు. ఎంఎస్ఎంఇ(చిన్న, మధ్యతరాహా పరిశ్రమల) వ్యాపారుల కోసం రుణ సదుపాయ పథకాన్ని ప్రారంభించనున్నామని కూడా చెప్పారు. 2021 మార్చి 31 వరకు ఎంఎస్ఎంఇ రుణ పునరుద్ధరణ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్)ను ఆదేశించింది.
Increase FPI limit on corporate bonds