Monday, April 29, 2024

కుషియారా నదీజలాలపై భారత్‌-బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందం

- Advertisement -
- Advertisement -

India and Bangladesh sign 7 key MoUs

న్యూఢిల్లీ : కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్‌-బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం కుదిరినట్టు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంయుక్తంగా ఆ సమావేశ వివరాలను వెల్లడించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్ బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతోంది. ఐటీ, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో మరింత సహకరించుకోవాలని నిర్ణయించుకొన్నాం. విద్యుత్తు పంపిణీ లైన్లపై చర్చలు జరుగుతున్నాయి. వరదల విపత్తు నిర్వహణలో సహకారం పెంపొందించుకొంటాం. వరదలకు సంబంధించిన రియల్‌టైమ్ డేటాను బంగ్లాదేశ్‌తో పంచుకొంటాం. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 54 నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి ఇరుదేశాల ప్రజలకు జీవనాధారం. ఈరోజు కుషియానా నదీ జలాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది” అని వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనా మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ విజయవంతంగా జరుపుకొన్న భారత ప్రభుత్వం, మిత్రులకు అభినందనలు తెలిపారు.

బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రహ్మాన్ ప్రసంగానికి సంబంధించిన పుస్తకాన్ని ప్రధాని మోడీకి ఆమె బహూకరించారు. హసీనా తన పర్యటనలో భాగంగా మంగళవారం రాజ్‌ఘాట్ లోని బాపూజీ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఆమెకు రాష్ట్రపతి భవనంలో గౌరవ వందనం సమర్పించారు. అక్కడ ఆమెకు ప్రధాని మోడీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హసీనా మాట్లాడుతూ భారత్‌ను సందర్శించడం తనకెప్పుడూ సంతోషం గానే ఉంటుందన్నారు. భారత్ మా మిత్ర దేశం. ముఖ్యంగా మా బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో వారి సహకారం ఎన్నటికీ మరువలేనిది. మాకు స్నేహసంబంధాలు ఉన్నాయి. పరస్పరం సహకరించుకొంటాం ” అని పేర్కొన్నారు. ఆమె తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ , ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్‌తో భేటీ అయ్యారు. బంగ్లా ప్రధాని గురువారం రాజస్థాన్ లోని ఆజ్‌మేర్‌కు వెళ్లి మొయినుద్దీన్ చిస్తీ దర్గాను దర్శించే అవకాశం ఉంది. హసీనా చివరిసారిగా 2019లో భారత్ లోపర్యటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News