Monday, April 29, 2024

అసలైన పోరుకు వేళాయె..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగే రసవత్తర పోరుకు కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్ సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. భారత్ గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత్, సౌతాఫ్రికాలు అసాధారణ ఆటతో అదరగొడుతున్న విష యం తెలిసిందే. ఇరు జట్లు ఇప్పటికే అధికారికంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. భారత్ ఆడిన ఏడు మ్యాచుల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో జయకేతనం ఎగుర వేసింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి తిరిగి అగ్రస్థానానికి దూసుకెళ్లాలని భావిస్తోంది. అయితే బ్యాటిం గ్, బౌలింగ్ విభాగాల్లో జోరుమీదున్న టీమిండియాను ఓడించడం సఫారీలకు అంతతేలికేం కాదనే చెప్పాలి. కానీ డికాక్, వండర్‌డుసెన్, మిల్లర్, క్లాసెన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్న సౌతాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో ఫైనల్ కానీ ఫైనల్ సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయం.

జోరుమీదున్న గిల్, రోహిత్..
ఈ టోర్నీలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నారు. టీమిండియా విజయాల్లో వీరిద్దరి పాత్ర చాలా కీలకం. రోహిత్, గిల్‌లు పోటీ పడి పరుగుల వరద పారిస్తున్నారు. కీలకమైన సౌతాఫ్రికా పోరులో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. కెప్టెన్ రోహిత్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. గిల్‌తో కలిసి కళ్లు చెదిరే ఆరంభాన్ని అందిస్తున్నాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లి కూడా జోరుమీదున్నాడు. వరుసగా భారీ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నా డు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియాకు భారీ స్కోరు కష్టమేమీ కాదు. ఇక కిందటి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా మెరుపులు మెరిపించాడు.

ఇది కూడా టీమిండియాకు సానుకూల పరిణామమే. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన శ్రేయస్ విజృంభిస్తే సఫారీ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాలు కూడా నిలకడైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు. మరోవైపు బౌలింగ్‌లో కూడా భారత్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు సిరాజ్, షమి, బుమ్రాలు అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయారు. షమి జోరుమీదుండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఇప్పటికే 3 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టిన షమి ఈసారి అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. సిరాజ్, బుమ్రా, కుల్దీప్, జడేజాలతో భారత బౌలింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు సౌతాఫ్రికాను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సఫారీ టీమ్ సమతూకంగా ఉంది. క్వింటన్ డికాక్ వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. ఐడెన్ మార్‌క్రమ్, డుస్సెన్, క్లాసెన్, మిల్లర్ తదితరులు కూడా బ్యాట్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. డికాక్ ఇప్పటికే ఈ వరల్డ్‌కప్‌లో నాలుగు శతకాలు సాధించాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. బౌలింగ్‌లో కూడా సౌతాఫ్రికా బలంగా ఉంది. మార్కొ జాన్సెన్, రబడా, కేశవ్ మహారాజ్, ఎంగిడి, షమ్సి వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికా కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News