Saturday, May 4, 2024

అప్పుల ఊబిలో భారత్

- Advertisement -
- Advertisement -

మరో 33 వేల కోట్లకు బాండ్ల వేలం
రూ.169 లక్షల కోట్లకు పెరిగిన అప్పులు !
2028 నాటికి 100% దాటనున్న అప్పులు
భారత్ అప్పులపై ఐఎంఎఫ్ ఆందోళన
కేంద్ర సర్కార్‌కు ఐఎంఎఫ్ వార్నింగ్
రాష్ట్రాలపై కేంద్ర అప్పుల ప్రభావం
పెరిగిన అప్పులతో కేంద్ర పథకాలు ఉంటాయా..? ఊడుతాయా..?
రాష్ట్రాలకు శిరోభారంగా మారిన కేంద్ర పథకాలు

మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని, ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడటం కూడా అంత ఈజీకాదని, ఆర్ధిక ప్రమాదం పొంచి ఉందని అంశాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశం అప్పులు సుమారు 169 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోగా ఇవి చాలవన్నట్లుగా ఈనెల 29వ తేదీన కేంద్ర ప్రభుత్వం మరో 33 వేల కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకునేందుకు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిందని, అందుకు తగినట్లుగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అధికారులను క్లియరెన్స్‌లు ఇచ్చారనే అంశాలపై ఆర్ధికవేత్తల్లో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. అంతేగాక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) కూడా భారతదేశం అప్పులపై ఆందోళన వ్యక్తంచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చిందని, ఈ అంశంపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

2028వ సంవత్సరం నాటికి భారతదేశ అప్పులు జిడిపిలో 100శాతానికి పెరిగే అవకాశాలున్నాయని కూడా ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తంచేసిందని, ఈ అంశమే ఇప్పుడు దేశంలో హాట్‌టాపిక్‌గా మారిందని వివరించారు. ఆర్ధిక నిపుణులను ఎవ్వరిని కదిలించినా దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనే అంశాలపై చర్చిస్తూ భయాందోళనలను వ్యక్తంచేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ అప్పుల ప్రభావం కూడా రాష్ట్రాలపై ప్రతికూలంగా ఉంటాయని, అందుకే తాము కూడా కేంద్ర ప్రభుత్వ పోకడలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆ అధికారులు వివరించారు. అసలే కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయం దగ్గరపడుతోందని, 2024 ఫిబ్రవరి నెలలోనే కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని, ఆ బడ్జెట్ తీరుతెన్నులను చూసుకొన్న తర్వాతనే రాష్ట్రంలో 2024-25వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను తాము రూపొందించుకోవాల్సి ఉంటుందని, అందుకే తాము కేంద్రం అప్పులపై టెన్షన్ పడుతున్నామని ఆ అధికారులు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులకు తిరిగి వడ్డీల రూపంలో చెల్లింపులు, ఇతర చెల్లింపులకే ఏడాదికి సుమారు 20 లక్షల కోట్ల రూపాయల నిధులను వ్యయం చేయాల్సి వస్తోందని, ఇంతటి దయనీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థ ఉంటే ఇక రాష్ట్రాలకు ఏమిస్తారు..? కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇంకెన్ని నిధులు ఇస్తారు…? అసలు వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పథకాలంటూ ఉంటాయా? ఉండవా? అనే అనుమానాలను కూడా తలెత్తుతున్నాయని ఆ అధికారులు టెన్షన్ పడుతున్నారు. విద్య, వైద్య రంగాలు, ఆహార భద్రతా చట్టం అమలు, గృహ నిర్మాణాలు, విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టులు ఇలా అనేక విభాగాల్లో అమలులో ఉన్న కొన్ని పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా నిలిపి వేయడం, ఆ పథకాలకు ప్రజలు ఆకర్షితులవ్వడంతో గత్యంతరం లేక వాటిని కొనసాగిస్తుండటంతో నిధులను రాష్ట్ర ఖజానాల నుంచే ఖర్చు చేయాల్సి వస్తోందని వివరించారు. గడచిన నాలుగేళ్ళుగా రకరకాల కుంటిసాకులతో, దొంకలెక్కలతో రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో కోతలు విధించడం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను భారీగా తగ్గించడంతో రాష్ట్రాల్లో అమలవుతున్న ఆ పథకాలకు తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలు సొంత నిధులతో కేంద్ర ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ వస్తున్నాయని, దీంతో రాష్ట్రాలపై మోయలేని భారంపడుతోందని ఆ అధికారులు వివరించారు.

కేంద్ర ప్రభుత్వ పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు రావాల్సిన 41 శాతం నిధులు పేరుకే వస్తున్నాయని, కానీ వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లెక్కలు కడితే కేవలం 29.1 శాతం మాత్రమే కేంద్రం నుంచి నిధులు వస్తున్నట్లుగా ఉందని ఆ అధికారులు వివరించారు. ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై మోయలేని భారాలను మోపుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం భారత ప్రభుత్వం జిడిపిలో 40 శాతంకు లోబడి మాత్రమే అప్పులు చేయాల్సి ఉంటుందని, రాష్ట్రాలు 20 శాతానికి లోబడి మాత్రమే అప్పులు చేయాల్సి ఉంటుందని, కానీ కేంద్రం అప్పులు 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో 81 శాతం ఉండగా వాటిని ఈ ఏడాది 70 శాతానికి తగ్గించుకునే ప్రయత్నాలు చేసిన కేంద్ర ప్రభుత్వం తన ఆర్ధిక విధానాలను మార్చుకొని అప్పుల జోలికి వెళ్ళకుండా అందుబాటులో ఉన్న నిధులతోనే పాలన సాగిస్తున్నట్లుగా కనిపించిందని, కానీ మళ్ళీ మరో 33 వేల కోట్ల రూపాయలను రుణాలు పొందేందుకు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడంతో కొత్త టెన్షన్‌లు మొదలయ్యాయని వివరించారు. అప్పుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేసినట్లుగా ఒక ఆరు నెలలపాటు మౌనం పాటించిన కేంద్ర సర్కార్ మళ్ళీ కొత్త అప్పులు చేయడానికి ఉపక్రమించడంతోనే ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయని వివరించారు.

ఇలా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తూనే రాష్ట్రాలను మాత్రం అప్పులు చేయవద్దని సూచించడమే కాకుండా ఉచితాలు, సబ్సిడీలు, ఇతర రాయితీలు, నగదు బదిలీ పథకాలు రద్దు చేసుకోవాలని కేంద్రం సూచిండంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాలు చేసిన అప్పులు, కార్పోరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గ్యారెంటీలు పెనుభారంగా మారాయని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు రాష్ట్రాలను వేధించడమే పనిగా పెట్టుకొన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం చేసిన అప్పుల నిధులను ఉత్పత్తి రంగాలు, అభివృద్ధి పథకాలు (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్)కు ఖర్చు చేసినట్లయితే దేశంలో ఎకనమిక్ యాక్టివిటీ జరిగి ఉండేదని, రాష్ట్రాలు కూడా ఆర్ధికంగా నిలదొక్కుకునేవని పేర్కొన్నారు. కానీ అలా చేయకుండా అనుత్పాదక రంగాలపైన లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం మూలంగా అభివృద్ధి లేకుండా, ఎకనమిక్ యాక్టివిటీ లేక, సంక్షేమ రంగాలు, సేవా రంగాలపైన కూడా ఖర్చు చేయకపోవడంతో ప్రజల కొనుగోలుశక్తి పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఒకవైపు అప్పులు పెరిగాయేగానీ ఆ మేరకు దేశ ప్రజల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడలేదని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అప్పులు ఆర్ధిక సంవత్సరం ముగిసే 2024 మార్చి 31వ తేదీ నాటికి ఏకంగా 169 లక్షల కోట్లకు పెరుగుతాయని, కనీసం దీనికి కూడా కేంద్రం ఎలాంటి పరిష్కారమార్గాలను కనుగొనలేదని, కేవలం రాష్ట్రాల అప్పులపైనే ఆంక్షలు విధించడానికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని వివరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులతో దేశంలోని 142 కోట్ల మంది జనాభాలో ఒక్కొక్కరి తలపైన సుమారు 1.75 లక్షల రూపాయల అప్పుల భారాన్ని మోపారని ఆ అధికారులు వివరించారు. ఈ మొత్తం వాస్తవ పరిస్థితులను పక్కనబెట్టి అప్పులు చేస్తే దేశం యావత్తూ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రాలపైన పడటం సబబుగాలేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రాలపైన పెత్తనం చేస్తూ ఆర్ధిక ఆంక్షలు విధించే పనులను పక్కనబెట్టి ఆర్ధిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా… అని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖాధికారులు దృష్టిసారిస్తే సబబుగా ఉంటుందని ఆ అధికారులు హితవు పలికారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News