Sunday, April 28, 2024

చైనా నేతలకు రాజకీయాలెక్కువ

- Advertisement -
- Advertisement -
India is my home for rest of my life: Dalai Lama
వైవిధ్యత తెలియని సంకుచితులు
సామరస్య ఇండియాలోనే ఉంటా
వాదన బలోపేత శక్తి లేదేమో
జిన్‌పింగ్‌ను కలిసేది లేదు
అక్కడి పాతమిత్రులను చూస్తా
ప్రవాస బౌద్ధ నేత దలైలామా

టోక్యో : చైనా నేతలకు భిన్నత్వం, వైవిధ్య సంస్కృతులపై అవగాహనలేదని, అసలు వీటి అర్థమే గ్రహించలేరని బౌద్ధ గురువు దలైలామా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న ఈ మతగురువు తాను భారత్‌లోనే ఉంటానని, అక్కడి ప్రశాంతత తనను ఆకట్టుకుందని తెలిపారు. చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ నేతల పాటిస్తున్న కట్టుదిట్టమైన సామాజిక నియంత్రణలతో చేటు తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ సంస్కృతులతో తలెత్తే వైవిధ్యతను చైనా కమ్యూనిస్టులు భరించలేరని , దీని గురించి వారికి ఏదైనా అవగావహన ఏర్పడితే , వారు దీనిని అర్థం చేసుకుంటే కదా? వారు దీనిని ఆదరించే పరిస్థితి ఏర్పడేది అని వ్యాఖ్యానించారు. 86 సంవత్సరాల ఈ బౌద్ధ సన్యాసి చాలాకాలంగా భారత్‌లోనే ఆశ్రయం పొంది ప్రవాస జీవితం గడుపుతున్నారు. టోక్యో వేదికగా జరిగిన ఓ ఆన్‌లైన్ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు దలైలామా సమాధానాలు ఇచ్చారు. టోక్యోఫారెన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. తాను చైనా నేత జిన్‌పింగ్‌ను కలిసే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు.

చైనాలో జిన్‌పింగ్ మూడోసారి కూడా సర్వం సహా అధికారాలను చేపట్టబోయే ప్రక్రియ గురించి, జిన్‌పింగ్ సర్వసత్తాకత గురించి మాట్లాడేందుకు దలైలామా నిరాకరించారు. ఇతర భావాలను, ఆచార వ్యవహారాలను వారు అంగీకరించేందుకు ముందుకు రానేరారు. ఇది చాలా ప్రమాదకర ధోరణి అవుతుంది. ప్రజలపై సామాజికపు పూర్తి స్థాయి కట్టుబాట్లు విధించడం భిన్న సంస్కృతులను ఆదరించకపోవడం హానికారకం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇతర మతాలు, సంస్కృతులపై చైనా ఆధిపత్యం తీవ్రస్థాయిలో అణచివేతకు దిగిందనే విమర్శలు ఉన్నాయి. టిబెటియన్లు, టర్కిక్ ముస్లిం య్యూగూర్స్, ఇతర మైనార్టీ వర్గాలపై దాడులను వారి సంస్కృతి సంప్రదాయల అణచివేత దిశగా తీవ్రతరం చేసిందనే విమర్శలు ఉన్నాయి. తాను స్థానిక రాజకీయ సంక్లిష్టతల విషయంలో జోక్యం చేసుకోదల్చుకోలేదని, అయితే తైవాన్, చైనా ప్రధాన భూభాగంలోని సోదరసోదరీల గురించి పట్టించుకుంటానని, ఇందులో రాజీపడేది లేదన్నారు.

చైనాలో పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉందన్నారు. అయితే ఒక్కోసారి మనసు చివుకుమంటుంది. కానీ ఓ బౌద్ధ సన్యాసి ఇటువంటి సంక్లిష్టతలపై ఏం చేయగలడనే భావన వస్తుంది. ఇంతకంటే ఏం చేయగలమనే ఆలోచన తేలికగానే ఏర్పడుతుందని బాధాకరంగా స్పందించారు. తాను కేవలం టిబెట్‌కు సరైన స్వయంప్రతిపత్తిని, టిబెటియన్ల సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడుతానని దలైలామా తరచూ చెపుతూ వస్తున్నారు. అయితే టిబెట్ స్వాతంత్య్రానికి దలైలామా వివిధ చర్యలకు దిగుతున్నాడని ఈ విధంగా ఆయన రాజకీయ ప్రచారానికి పాల్పడుతున్నారని చైనా పాలకులు మండిపడుతున్నారు. 2011లో దలైలామా రాజకీయాల నుంచి దూరం అవుతున్నట్లు ప్రకటించారు. అయితే టిబెటియన్ల తరఫున వారి సంప్రదాయాల పరిరక్షణకు పోరు ఆగదని ప్రకటించారు.

మత రాజకీయాలతో చేటే

భారత్‌లోనే ఉంటానని, మతసామర్యానికి ప్రతీకగా ఉన్న భారత్‌లోనే తాను ఇకపైనా ప్రశాంతంగా ఉంటానని తెలిపారు. మతాల పేరిట రాజకీయాలు వద్దని పిలుపు నిచ్చారు. నిజానికి అన్ని మతాల సారాంశం ఒక్కటే మతం మానవ సమానతను కోరుతుంది. అయితే ఇప్పుడు మతాన్ని రాజకీయం చేయడం, మత ప్రాతిపదికన రాజకీయాలను నడిపించి అధికారాలను కేంద్రీకృతం చేసుకోవడం దారుణమైన విషయం అవుతోందన్నారు. అయితే అవాంఛనీయతనే ఇప్పుడు వాస్తవికత అయిందని దీనిపై తన వంటి సన్యాసి స్పందన బలహీనమే అవుతుందేమో అని వ్యాఖ్యానించారు. తనకు వయస్సు మీదపడుతున్నందున ఏదో విధంగా చైనాలోని తన పాత మిత్రులను, శ్రేయోభిలాషులను కలుసుకోవాలని అనుకుంటున్నానని తెలిపారు.

మావో జెడాంగ్ నుంచి పలువురు కమ్యూనిస్టు నేతలతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని, వారి ఆలోచనలు మంచివే అయితే కఠిన నియంత్రణలకు దిగడం, కట్టుదిట్టమైన నిర్ణయాలకు పాల్పడటం వంటివి అప్పటి నుంచి ఇప్పటివరకూ ఉన్న కమ్యూనిస్టు నేతల ఆలోచనా విధానం అని, అయితే ఇకపై రాబోయే చైనా నేటితరం ఆలోచనలలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. చైనాలో భిన్నమైన తెగలు ఉన్నాయి, టిబెట్ , షిన్‌జియాంగ్ సంబంధించి ప్రత్యేక సంస్కృతి ఆచార వ్యవహారాలు ఉన్నాయి. చైనాలో హాన్ జాతి వారే కాకుండా ఇతర వర్గాలూ ఉన్నాయి. అయితే నాయకత్వం సంకుచిత ఆలోచనలు దీనికి తోడవుతున్న రాజకీయాలతో నష్టం వాటిల్లుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News