నాలుగు లేన్లలో 14.85 కి.మీ. నిర్మాణం
చైనా టన్నెల్కన్నా పొడవైనది
సైనికులకు ఆయుధాలు, ఆహారం సరఫరాల కోసం
గ్రీన్ సిగ్నలిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద భారీ సొరంగ నిర్మాణానికి భారత్ సిద్ధమవుతోంది. వ్యూహాత్మకమైన ఈ టన్నెల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు హిందుస్థాన్లో కథనం ప్రచురితమైంది. నాలుగు లేన్లలో అస్సాంలోని గోహ్పూర్, నుమాలీగఢ్ పట్టణాలను కలుపుతూ ఈ భారీ సొరంగాన్ని నిర్మించనున్నారు. చైనా సరిహద్దులో విధులు నిర్వహించే జవాన్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయుధాలు, ఆహారం, తదితర సరఫరాలను నిరంతరం కొనసాగించేందుకు వీలు కల్పించేలా ఈ సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. నది అడుగు భాగాన మొదటిసారిగా భారత్ చేపడుతున్న నిర్మాణమిది. జియాంగ్స్ రాష్ట్రంలో తాయిహు సరస్సు కింద చైనా నిర్మించిన టన్నెల్కన్నా ఇది పొడవైనది అవుతుంది. ఏడాది పొడవునా అస్సాం, అరుణాచల్ప్రదేశ్ మధ్య రాకపోకలు సాగించేందుకు ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతుంది.
ఈ మార్గంలో 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు నడిపే వీలుంటుంది. ఈ సొరంగ రహదారి పొడవు 14.85 కిలో మీటర్లుంటుందని జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎఐడిసిఎల్) సీనియర్ అధికారి తెలిపారు. టన్నెల్లోకి నీరు చేరకుండా డిజైన్ చేసినట్టు ఆ అధికారి తెలిపారు. వెంటిలేషన్, ఫుట్పాత్, మురుగునీటి వ్యవస్థ, అత్యవసర ద్వారాలు సహా పలు సౌకర్యాలను ఈ టన్నెల్లో ఏర్పాటు చేయనున్నారు. చైనా జియాంగ్స్ రాష్ట్రంలోని సొరంగం పొడవు 10.79 కి.మీ. మాత్రమేనని ఆ అధికారి తెలిపారు. అమెరికాకు చెందిన లూయిస్ బెర్గర్ కంపెనీతో కలిసి తయారు చేసిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డిపిఆర్)కు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే ఆమోదం తెలిపింది. నదులపై నిర్మించే వంతెనలు శత్రువులకు లక్షంగా మారనున్నాయని, సొరంగ మార్గాలే సురక్షితమని సైనికాధికారులు సూచించడంతో కేంద్రం వెంటనే ఆమోదం తెలిపింది.
India to build Huge tunnel under Brahmaputra River