Friday, May 10, 2024

సిరీస్‌పై టీమిండియా కన్ను

- Advertisement -
- Advertisement -

India vs England 2nd T20 tomorrow

బర్మింగ్‌హామ్: తొలి టి20లో ఘన విజయం సాధించిన టీమిండియా శనివారం ఇంగ్లండ్‌తో జరిగే రెండో మ్యాచ్‌ఖు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. హార్దిక్ పాండ్య కిందటి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే హార్దిక్ విజృంభిస్తే భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. తొలి టి20లోనే ఈ విషయం స్పష్టమైంది. మొదటి మ్యాచ్‌లో హార్దిక్ ఇటు బ్యాట్‌తో అటు బంతితో చెలరేగి పోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బాగానే ఆడాడు. సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాలు కూడా మెరుపులు మెరిపించారు. ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా,బుమ్రా, అయ్యర్ తదితరులు కూడా జట్టులో చేరునున్నారు. దీంతో టీమిండియా మరింత బలోపేతంగా మారే అవకాశాలున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

గెలవాల్సిందే..

ఇక తొలి మ్యాచ్‌లో ఓడిన ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ చావో రేవోగా మారింది. సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. లేకుంటే సిరీస్ కోల్పోవడం ఖాయం. దీంతో ఇంగ్లండ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే పోరాట పటిమకు మరో పేరుగా చెప్పుకునే ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయలేం. జోస్ బట్లర్, జాసన్ రాయ్, డేవిడ్ మలన్, మోయిన్ అలీ, శామ్ కరన్, బ్రూక్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ బట్లర్ డకౌట్ కావడం ఇంగ్లండ్‌కు ప్రతికూలంగా మారింది. ఈసారి మాత్రం బట్లర్ భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. అతను తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే భారత్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. మరోవైపు తొలి మ్యాచ్‌లో విఫలమైన బౌలర్లు ఈసారి రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునే ముందుకు సాగే సత్తా ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకున్నా ఆశ్చర్యం లేదు. దీంతో టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం అనుకున్నంత తేలికేం కాదనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News