మోటార్ సైకిళ్లు, కార్లు చోరీ చేస్తున్న నిందితుడు
రూ.60,50,000 విలువైన వాహనాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి సజ్జనార్
హైదరాబాద్ : వాహనాలు, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఏడు కార్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.60,50,000 ఉంటుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని కృష్ణాజిల్లా, ఘంటశాలకు చెందిన తాట ప్రసాద్ అలియాస్ మామిడిపల్లి శశికాంత్ అలియాస్ ప్రసాద్ గుంటూరు జిల్లాలోని కొళ్లురులో ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారిన నిందితుడు చోరీలు చేయడం ప్రారంభించాడు. 2003 నుంచి ఇళ్లల్లో చోరీలు చేస్తూ బంగారు ఆభరణాలు, కార్లు, మోటారు సైకిళ్లు ఎత్తుకెళ్లుతున్నాడు.
2003లో తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, నర్సాపురం, ఒంగోల్, తెలనాలి, గుంటురు, బంజారాహిల్స్, కెపిహెచ్బి ప్రాంతాల్లోని ఇళ్లల్లో చోరీలు చేశాడు. గతంలో చిత్తూరులో చోరీ చేయడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చిత్తూరు జైలు నుంచి అక్టోబర్16,2019న విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తన సహచరులు మాలకొండా రెడ్డి, ఉస్మాన్తో కలిసి ఆర్సి పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంట్లో చోరీ చేశారు. ఇంట్లోని ఎల్సిడి టివి, ఎర్టిగా కారును దొంగతనం చేశారు. నిందితుడిని మాదాపూర్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై 10 కేసులు ఉన్నాయి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభినందించారు.