Tuesday, April 30, 2024

యూట్యూబ్ చానెళ్లపై ఐటి శాఖ నిఘా

- Advertisement -
- Advertisement -

IT department surveillance on YouTube channels

కేంద్ర మార్గదర్శకాలు పాటించని వారిపై చర్యలు
రంగంలోకి దిగిన ఐటి, పోలీసు శాఖ

హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 200 యూట్యూబ్ వార్తా చానెళ్ల ప్రసారాలపై అటు ఐటిశాఖ, ఇటు పోలీసు శాఖ నిఘా సారించడంతో పాటు ఆరా తీస్తున్నాయి. ఈక్రమంలో యూట్యూబ్ చానెళ్లు అడ్డూఅదుపూ లేకుండా చేస్తున్న అభ్యంతరకర ప్రసారాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో పాటు ఐటి, పోలీసు శాఖలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాయి. అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారం చేయడం, మతాలు, కులాల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు కొందరిని లక్ష్యంగా చేసుకుని దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న చానెళ్లను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సాక్షాత్తు సిఎం కెసిఆర్ మనవడిపై ఓ యూట్యూబ్ చానెల్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే యూట్యూబ్ చానెళ్లను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) శాఖ ఇప్పటికే రంగంలోకి దిగి కసరత్తు ప్రారంభించింది.

ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టింగులు, న్యూస్ చానెళ్ల కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎతిక్స్ కోడ్) రూల్స్- 2021ను ప్రకటించింది. దీనిప్రకారం యూట్యూబ్, ఇతర ఆన్‌లైన్ న్యూస్ చానెళ్లలో అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారం చేస్తే సంబంధిత చానెళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రసారాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడం, వాటిని గరిష్ఠంగా 15 రోజుల్లోపు పరిష్కరించడం చానెళ్ల బాధ్యత. రాష్ట్రంలో దాదాపు 200 వరకు యూట్యూబ్ వార్తా చానెళ్లు నిబంధనలనుపాటించేలా చూసేందుకు ఐటి శాఖ త్వరలో వారితో సమావేశం ఏర్పాటు చేయనుంది. ప్రజల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రతి చానెల్ తప్పనిసరిగా కార్యాలయ చిరునామా, ప్రతినిధి పేరు, ఫోన్ నంబర్లను ప్రదర్శించాల్సి ఉంటుందని ఐటి శాఖ అధికారులు వివరిస్తున్నారు. జర్నలిజంపై ఏమాత్రం అవగాహన లేని వారు సైతం యూట్యూబ్ చానెళ్లను నిర్వహిస్తున్నారని, అదేవిధంగా ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల గురించి వారికి ఏమాత్రం తెలియదని ఐటి అధికారులు వివరిస్తున్నారు.

అనతికాలంలో యూట్యూబ్ చానెళ్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలు వివరిస్తామని ఐటి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిబంధనలను పాటించని చానెళ్లకు యూట్యూబ్ నుంచి చెల్లింపులు రాకుండా అడ్డుకుంటామని, ఆ తర్వాత చానెల్‌ను రద్దుచేయాలని ప్రభుత్వం తరఫున యూట్యూబ్‌ను కోరతామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని యూట్యూబ్ చానెళ్లన్నీ కేంద్ర మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలంటూ యూట్యూబ్‌కు లేఖ రాశారు. ఇదిలావుండగా ఇటీవలే రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అదేవిధంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితర ఎంఎల్‌ఎ నిర్వహించిన ఓ సమావేశంలో దాదాపు 50 యూట్యూబ్ ఛానల్స్ వరకు దర్శనమిచ్చాయి. దీనిని చూసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా అవాక్కయ్యారు. ఇన్ని చానెల్స్ ఎక్కడ ఉన్నాయి అని విలేకరులని వారు ఆశ్చర్యకరంగా ప్రశ్నించిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News