Monday, April 29, 2024

బడుగుల బాంధవుడా జయహో

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో గుప్తులపాలన స్వర్ణయుగ మనేది ఒక చరిత్ర. ఆ చరిత్రను తలపించేలా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ యుగం సాగుతున్నది. సిఎం కెసిఆర్ పాలనలో బడుగు బలహీనవర్గాలు సంతోషంగా, సుసంపన్నంగా ఉన్నారన్నది నిజం. ఇది అక్షర సత్యం. ‘ప్రార్ధించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అనే లోకనీతిని నిజంచేస్తూ సాగుతున్నది సిఎం కెసిఆర్ పాలన. పేదవాని ఆకలి బాధలకు సానుభూతితో పైపైపూతలు పూయకుండా వారికి అండగా నిలుస్తున్నది తెలంగాణ సర్కార్. తెలంగాణలోని బడుగు, బలహీనవర్గాల వారిలో నెలకొన్న ఆత్మనూన్యతను తొలగిస్తూ ఆత్మగౌరవాన్ని పెంచే పథకాలను కెసిఆర్ ప్రభుత్వం వారికి చెంతకు చేర్చింది.అంతేకాదు ప్రతిపేదవాడు నేడు సమాజంలో తలెత్తు కొని తిరిగే విధంగా పథకాల అమలు సాగుతున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివక్షకు గురైన తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతి అనేది కెసిఆర్ పాలనలోనే చూస్తున్నాం. గత తొమ్మిదిన్నరేండ్లు కెసిఆర్ పాలనను స్వర్ణయుగంతో పోల్చు కోవడమంటే తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనం. సిఎం కెసిఆర్ లాంటి ఉదాత్తమైన నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. ఆయన లాంటి ఉత్తమైన నాయకుడు మరొకరు కనిపించరు. ఇది అతిశయోక్తికాదు. ఎంతో దూరదృష్టి వుంటే తప్ప అంతటి నాయకుడు ఎవరూ కాలేరు. సంపూర్ణమైన నాయకుడు అంటే కెసిఆర్. అందుకే ఆయన తెలంగాణ సాధించగలిగారు. అసలు తెలంగాణ ఉద్యమమంటే అందరూ చేసేదేలే.. ఇప్పుడు కొత్తగా ఏముంటుందిలే.. అన్నవాళ్లే చాలా మంది. కాని తెలంగాణ జెండాఎత్తి, కొత్తతరం రాజకీయ ఉద్యమ పోరాటాన్ని మిళితం చేసిన కెసిఆర్ తెలంగాణ సాధించడం అన్నది ఎవరూ ఊహించింది కాదు.. అందుకే తెలంగాణ ఉద్యమం అన్నది చరిత్రలో ఒక సువర్ణాక్షరమైతే.. కెసిఆర్ ఉద్యమ జీవితం ఒక సువర్ణాధ్యాయం. ఆయన పాలన ఒక చరిత్ర. మన నిధులు మనకే అంటే సరే ఎంతో కొంత మన అభివృద్ధి మనమే చేసుకోవచ్చు అనుకున్నాం. కాని తెలంగాణ వస్తే ఇంత ప్రగతి సాధిస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు.

తెలంగాణ వస్తే ఇంత తక్కువ సమయంలో తెలంగాణ రూపురేఖలు ఇంత గొప్పగా ఆవిష్కృతమవుతాయని ఏ ఒక్కరూ అనుకోలేదు. తెలంగాణ చరిత్ర తెసిన వారు కూడా ఊహించలేకపోయారు. తెలంగాణ వచ్చిన ఇంత తక్కువ కాలంలో కోటి ఎకరాల మాగాణ అవుతుందని అనుకున్నారా? అయితే అందరూ తెలంగాణ సస్యశ్యామలం కావాలనుకున్నారు. అందుకు కనీసం ఓ ఇరవై ముప్పై ఏళ్లు పడుతుందేమో అనే అందరూ భావించారు. కాని, సిఎం కెసిఆర్ అద్భుతాలు సృష్టించారు. అన్ని వర్గాల అభ్యున్నతి సాధించారు.. కెసిఆర్ పాలనలో చిమ్మచీకట్ల నుంచి తెలంగాణలో వెండి వెలుగులు ఆవిష్కృమయ్యాయి. ఒకనాటి తెలంగాణ పరిస్ధితి గుర్తు చేసుకుంటే, ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా అన్నది తెలిసిపోతుంది. సహజంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేయాలన్న దానిపై కొన్ని పరిమితులలోనే ఆలోచన చేశారు. అంతటితో అవే గొప్ప పథకాలు అని ప్రచారం చేసుకున్నారు, కీర్తించుకున్నారు. అది గతం.కాని ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకకాలంలో ఇన్ని రకాల పథకాలు అమలు చేసి తెలంగాణలో సమస్యలు లేని కాలాన్ని సృష్టిస్తారని ఎవరూ అనుకోలేదు. అసలు దేశంలో తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలలో కనీసం ఒక్క శాతం కూడా అమలు కావడం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా దేశమంతా అమలవుతున్న రేషన్ బియ్యం, వృద్ధులకు పెన్షన్ ఇవి తప్ప మరే పథకాలు ఇతర రాష్ట్రాలలో లేవు. అయితే ఇక్కడ కూడా తెలంగాణ ప్రత్యేకమే.

సిఎం కెసిఆర్ ఎంతటి ప్రజానాయకుడో అర్ధం చేసుకోవచ్చు. ఎవరు అవునన్నా.. కాదన్నా సంక్షేమ రంగంలో పథకాల సునామీ సృష్టించిన సిఎం కెసిఆర్ బడుగు, బలహీన వర్గాల వారి శ్రేయస్సు కోరి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ‘నభూతో నభవిష్యతి’ అనడంలో సందేహం లేదు. ఈ కారణంగానే దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వేనోళ్ళ ప్రశంసిస్తున్నాయి. కెసిఆర్ ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక ఎత్తు. బడుగువర్గాలు తమ కాళ్ళ తామునిలబడే విధంగా చేపడుతున్న కార్యక్రమాలు మరోఎత్తు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన ప్రతి పథకం చరిత్రాత్మకమే. అందుకే ఆయన బడుగుల బాంధవుడిగా కీర్తిస్తున్నారు తెలంగాణ ప్రజానీకం.

గత ముఖ్యమంత్రులు బిసిలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారు. కానీ సిఎం కెసిఆర్ మాత్రం తెలంగాణలో బిసిల అభ్యున్నతికి బాటలు వేస్తుండాన్ని సబ్బండ వర్గాలు సైతం మెచ్చుకుంటున్నాయి.రాజకీయాలకు అతీతంగా కెసిఆర్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దార్శనికతతో బిసిలు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వ ప్రోత్సాహం పొందుతున్నారు. ప్రభుత్వపరంగా వారికి అన్ని రకాల అండదండలు లభిస్తున్నాయి. బిసి వర్గాలు కూడా సంపన్న వర్గాలుగా మారడానికి ముఖ్యమంత్రి తన మేధస్సుకు పదును పెట్టి అనేక వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నారు. బిసిలలోని ప్రతి కులానికీ ప్రభుత్వపరంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జనాభాలో సగంపైన ఉన్నదివారే. 150 పైగా కులాలు వారివే. ప్రజల దైనందిన జీవనానికి ఆలంబనగా ఉన్న వృత్తులలో 90% పైగా వారి చేతుల మీదుగా జరగవల్సిందే.ఆ ప్రజా సమూహమే మన తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బిసి) కులాల ప్రజలు. తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నది. కుల వృత్తులన్నీ బిసి వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టింది.

ఉత్పత్తి, సేవా రంగాల్లో భాగస్వామ్యమైన సబ్బండ వర్గాలు కొనసాగించే కుల వృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముడిపడి వుంటుంది.ఉత్తర భారతదేశంలో మాదిరి కాకుండా వృత్తి కులాలన్నీ బిసి వర్గాలే అధిక శాతం నిర్వహించడం తెలంగాణకు ప్రత్యేకం. ధ్వంసమైన కుల వృత్తుల పునరుజ్జీవనమే లక్ష్యంగా తొమ్మిదిన్నరేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. అద్భుతమైన ఫలితాలు రాబడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణలో గొల్లకురుమలు, యాదవుల కోసం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం, బెస్తలు ముదిరాజుల కులవృత్తి అభివృద్ధి కోసం అమలు చేస్తున్న చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయి. వ్యవసాయం తరువాత పెద్ద ఎత్త్తున ఆధారపడిన కుల వృత్తి చేనేత రంగం. ఒకనాడు బ్రాహ్మణులతో సమానంగా ప్రజల నుండి గౌరవాన్ని పొందిన పద్మశాలి వర్గం నాటి సమైక్య పాలనలో ఆకలి చావులకు, ఆత్మహత్యలకు బలైపోయింది. వలస పాలకుల వరుస నిర్లక్ష్యంతో అవసాన దశకు చేరుకున్న చేనేత వృత్తి, ప్రభుత్వ చిత్తశుద్ధితో మంత్రి కెటిఆర్ కార్యదక్షతతో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకున్నది. గాయాల పాలైన చేనేత వృత్తి గాడిన పడుతున్నది. అదే సందర్భంలో కల్లు గీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలు సహా, నాయీ బ్రాహ్మణ, రజక తదితర వృత్తి కులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ వారిని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథాన నడిపిస్తూ యావత్ దేశం తెలంగాణ మార్గాన్ని అనుసరిస్తోంది.

కెసిఆర్ మార్కు పాలనకు నిదర్శనం. వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న మున్నూరు కాపులు సహా వడ్రంగి, కమ్మరి, కుమ్మరి వృత్తి కులాలకు కల్లు గీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలు, నాయీ బ్రాహ్మణ, రజక తదితర వృత్తి కులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ వారిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథాన నడిపిస్తున్నది. ఎంబిసిల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్‌దే. సంస్ధను ఏర్పాటు చేసి చేతులు దులుపు కోవడమనేది గత పాలకుల నిర్వాకంగా ఉండేది. అందుకు భిన్నంగా ఎంబిసి కార్పేరేషన్ ఏర్పాటుతో పాటు బడ్జెట్‌లో ఈ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడనేది కెసిఆర్ ఒక్కరికే సాధ్యమైంది. నాయకుడి మనసు మంచిదైతే ప్రజల జీవితాలకు భరోసా దొరుకుతుందనడానికి ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటే చక్కని ఉదాహరణ.బిసిల అభ్యున్నతి సిఎం కెసిఆర్‌తోనే సాధ్యమని వారి కోసం ఇంతగా చేసిన ముఖ్యమంత్రి దేశంలోనే మరొకరు లేరనేది నిర్వివాదాంశం.

బిసి బంధు పథకం బలహీన వర్గాలకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. తెలంగాణ ఉద్యమ సమయం లో రాష్ట్రమంతా పర్యటించి బడుగులు పడుతున్న బాధలను కెసిఆర్ కళ్ళారా చూశారు. ఆనాడే ఆయన మదిలో బిసి బంధు పథకమనే ఆలోచనకు బీజం పడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతో తన మానస పుత్రికగా బిసి బంధును కెసిఆర్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. బిసిల కోసం కేటాయించిన ఆత్మగౌరవ భవనాలు దేశంలో మరెక్కడా లేవు. అవి వారి భవిష్యత్తుకు పరిశోధనాలయాలుగా నిలుస్తాయనే చెప్పాలి. వెనుకబడిన తరగతుల కుల, చేతివృత్తుల వారికి రూ. లక్ష సాయమనేది అపూర్వం.

దేశంలో ఎక్కడా లేని విధంగా వృత్తి కులాలందరికీ రూ. లక్ష ఆర్థిక సాయం అందజేయడం చరిత్రాత్మక నిర్ణయంగా భావించాలి. వృత్తుల అభివృద్ధికి, వృత్తిదారుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదపడి వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. బిసి విద్యార్ధులకు చదువును అందించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పుతోంది. వెనుకబడిన వర్గాల యువత విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి విద్యార్థికి రూ. 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఏటా 300 మందికి ఈ పథకం ద్వారా విదేశాల్లో చదువుకోడానికి అవకాశం కల్పించడమనేది కెసిఆర్ పాలనా దక్షతకు తార్కాణం. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలన్న బిసి విద్యార్ధుల కలలను సాకారం చేసే దిశగా జ్యోతిభా ఫూలే విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నది. పేద, మధ్య తరగతి బి.సి. కుటుంబాల పిల్లల విదేశీ విద్య కలలను ప్రభుత్వం సాకారం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే. బిసి విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకూ ఓవర్సిస్ విద్యార్థులకు మాత్రమే అందిస్తున్న విధంగానే దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. ఇలా తెలంగాణను బహుజన్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీగా తీర్చిదిద్దిన కెసిఆర్ పాలన దేశమంతా రావాలన్నది ప్రజల ఆకాంక్ష. ఒక్క తెలంగాణే కాదు, దేశమంతా బడుగుల జీవితాలలో మార్పులు రావాలనేది వారి కోరిక.అందుకు కెసిఆర్ జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర కావాలి. కెసిఆర్ ప్రధాని అయితే దేశ రాజకీయాలలో కూడా మార్పులొస్తాయి. దేశమంతా తెలంగాణలో అమలవుతున్న పథకాలు అందుబాటులోకి వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశం సుభిక్షమవుతుంది. అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తుంది. దటీజ్ కెసిఆర్ … లాంగ్ లీవ్ కేసీఆర్.. జయహో కేసీఆర్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News