హైదరాబాద్: చట్టాలు తయారు చేయడానికి బడ్జెట్ ఆమోదించడంతో పాటు ఎలా ఉందో విశ్లేషించుకోవడానికి శాసన సభలో చర్చల జరగాలని సిఎం కెసిఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలపై ప్రగతి భవన్ లో సిఎం మీడియాతో మాట్లాడారు. చర్చల గొప్పంగా వాస్తవాల ఆధారంగా జరగాలని, ప్రజలకు ఉపయోగపడేవిధంగా ఉభయ సభల్లో సభ్యులు మాట్లాడాలన్నారు. అసెంబ్లీలో చర్చ ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలపడాలని, ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు వెలువడే విధంగా అసెంబ్లీ సమావేశాలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఏ పార్టీ సభ్యులైనా సరే ఏ విషయం గురించి అయినా సరే సభలో మాట్లాడవచ్చని, దానికి సమాధానం చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి, ఆచరణాత్మకమైన సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని కెసిఆర్ స్పష్టం చేశారు. సభ్యులు మాట్లాడే విషయాలతో వాస్తవాలు ప్రతిబింబించాలని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉండాలని సూచించారు. తెలంగాణ భవన్లో ఈనెల 7న సాయంత్రం ఐదు గంటలకు సిఎం కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ఎల్పి సమావేశం ఉంటుంది.
దివంగత దుబ్బాక ఎంఎల్ఎ సోలిపేట రామలింగారెడ్డి మరణానికి టిఆర్ఎస్ఎల్పి సంతాపం తెలపనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగాలన్నారు. కరోనా వ్యాప్తి నివారణ బాధితులకు అందుతున్న వైద్యం సదుపాయాలు, తెలంగాణలో విస్తరించిన వైద్య సేవలపై అసెంబ్లీలో చర్చించాలన్నారు. భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, తీసుకోవాల్సిన చర్చలపై అసెంబ్లీలో చర్చ జరపాలన్నారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం,నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేర ఎపి ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై చర్చ జరగాలన్నారు. జిఎస్టి అమలులో రాష్ట్రాలపై జరుగుతున్న అన్యాయంతో పాటు కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రాలకు కలుగుతున్న నష్టంపై చర్చ జరగాలన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానాల విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణిపై చర్చ జరగాలని కెసిఆర్ పేర్కొన్నారు.