గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న లారీని కారు ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. గురువారం గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులను మంచిర్యాల జిల్లాకు చెందిన అంజిబాబు, విడిదినేని గణేష్, అంగళ్ల సాయిప్రసాద్గా గుర్తించారు. వీరిలో అంజిబాబు తాండూరు గ్రామ సర్పంచ్గా పని చేస్తున్నారు. కారులో నలుగురు కలిసి బుధవారం రాత్రి 10 గంటలకు మంచిర్యాల జిల్లా తాండూరు నుంచి బయలు దేరి హైద్రాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ బస్ డిపో సమీపంలో కారు అతివేగంతో రోడ్డుపై ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు.
కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లడం తో నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో సర్పంచ్ అంజిబాబు, గణేష్లు అక్కడిక్కడే మృతి చెందారు. సాయిప్రసాద్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భానుప్రసాద్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రొక్లెయినర్ సాయంతో కారును బయటకు లాగారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుల బందువుల రోధనలతో గజ్వేల్ ఆసుపత్రి ఆవరణలో విషాదం అలుముకుంది. సిఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
three death dead in road accident at siddipet