Monday, April 29, 2024

కెసిఆర్‌కు కిసాన్ మోర్చా ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

Kisan Morcha praises KCR

రైతు అమరుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున సాయం ప్రకటించినందుకు, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సంయుక్త కిసాన్ మోర్చా ప్రశంసలు
రైతు అమరుల జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి పంపిస్తామని ప్రకటన, మంత్రి కెటిఆర్‌కు ట్వీట్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధానమంత్రి మోడీ ఈ నెల 19న ప్రకటించిన తర్వాత ఢిల్లీ సరిహద్దులో ధర్నా చేస్తున్న రైతు సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనపై ప్రధానంగా చర్చ జరిగింది. నివారించదగ్గ మరణాలపై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, అమరుల కుటుంబాలకు భరోసాను ప్రకటించలేదని, కానీ, తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందని పేర్కొంది. రైతు అమరుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడాన్ని ప్రస్తావించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకమని సమావేశానంతరం ఓ ప్రకటనలో సంయుక్త కిసాన్ మోర్చా అభిప్రాయపడింది. అంతేకాదు, ఈ ఆందోళనల్లో అసువులు బాసిన అమరులకు పరిహారం చెల్లించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కెసిఆర్ చేసిన డిమాండ్‌నూ ప్రస్తావించింది.

సింఘు సరిహద్దులో రైతులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ నెల 29న చలో పార్లమెంటు కార్యక్రమం యధావిధిగా ఉంటుందని ఈ సమావేశంలోనే రైతు నేతలు స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి విదితమే. రైతుల ఆందోళనలో చాలా మరణాలను అమర రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే నివారించగలిగేదని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఈ ఆందోళనల్లో సుమారు 700 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. కానీ కేంద్ర ప్రభుత్వం మిన్నకుండి పోయిందని, కనీసం రైతు అమరుల కుటుంబాలకు భరోసాగా ఏ ప్రకటనా చేయలేదని వివరించింది. అలాగే కేంద్రప్రభుత్వం కూడా రూ.25 లక్షలు అందించాలని కెసిఆర్ డిమాండ్ చేయడం హర్షదాయకమని పేర్కొన్నది. అంతేకాదు, ఆందోళనకారులపై పెట్టిన కేసులన్నింటినీ బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారని వివరించింది. పరిహారం అందిస్తామన్న తెలంగాణ ప్రభుత్వానికి రైతు అమరుల జాబితాను అందిస్తామని తెలిపింది.

అలాగే, ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ ట్వీట్‌ను సంయుక్త కిసాన్ మోర్చా ట్యాగ్ చేసి ట్వీట్లు చేసింది. ఏడాది పాటు పోరాడిన రైతులందరికీ ఈ సమావేశంలో రైతు నేతలు అభినందనలు తెలిపారు. తమ ఆందోళనలకు సంబంధించి సాగు చట్టాల రద్దు మినహా ఇతర డిమాండ్లపై ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాయాలనే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఇప్పటివరకు ప్రకటించిన అన్ని నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఏమైనా విషయాలు ముందుక వస్తే ఈ నెల 27వ తేదీన సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 22వ తేదీన యుపి రాజధాని లక్నోలో నిర్వహించతలపెట్టిన కిసాన్ మహాపంచాయత్‌లో పెద్దమొత్తంలో ప్రజలు పాల్గొనాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. 24వ తేదీన చోటు రామ్ జయంతి పురస్కరించుకుని నిర్వహించనున్న కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ దివస్, 26న ఢిల్లీ బార్డర్ మోర్చే పే చలో, అన్ని రాష్ట్రస్థాయి ఆందోళనలు, 29న చలో పార్లమెంటు కార్యక్రాలు యదావిధిగా సాగుతాయని వివరించింది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News