మా ఓపిక నశిస్తే బిజెపి బయట తిరగలేదు
పరకాల ఎంఎల్ఎ చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బిజెపి కార్యకర్తల రాళ్ల దాడిని ఖండిస్తూ మంత్రి కెటిఆర్-
మాది ఉద్యమ పార్టీ, ఆ బలం, బలగం మాకుంది
ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు చోటు లేదు
వాదనతో ప్రజలను ఒప్పించడం చేతగాకనే
బిజెపి దాడులను ఆశ్రయిస్తున్నది,
దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి
ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో
చిచ్చుపెట్టడానికి బిజెపి చేస్తున్న యత్నాలను
గమనించి దానిని ఎక్కడికక్కడ నిలదీయాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎ చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బిజెపి శ్రేణులు చేసిన దాడులను టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. గతంలోనూ బిజెపి భౌతిక దాడులకు ప్రయత్నించిందని గుర్తు చేశారు. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక దాడులకు బిజెపి పదే పదే దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం వాంఛనీయం కాదని పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టిఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందని అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం తమకు ఉన్నాయన్న విషయాన్ని బిజెపి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే, బిజెపి కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు. బిజెపి భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టిఆర్ఎస్ పార్టీకి ఉన్నదని, తమ ఓపికకు ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బిజెపిని హెచ్చరించామని గుర్తు చేశారు. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నామని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బిజెపి మర్చిపోకూడదని హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బిజెపి చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, బిజెపిని ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.