Saturday, May 4, 2024

మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ స్ఫూర్తితో ఐటిఐఆర్‌ను చేపట్టండి

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఐటిశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు మంత్రి కెటిఆర్ లేఖ

Minister KTR

ఐటిఐఆర్‌పై కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు
తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇలాగే వ్యవహరిస్తోంది
 ఐటిఐఆర్‌కు అండగా నిలిస్తే అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి

మన తెలంగాణ/హైదరాబాద్: ఐటిఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలిజీ ఇన్వెస్ట్‌మెంట్ రీ జియన్) పైన కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ముందని ఆ యన వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు గురువారం ఆ యనకు ఒక లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి (2014) నుంచి కేంద్రం ఇదే రీతిలో వ్యవహరిస్తోందని ఆయన తీవ్ర అసంతృప్తి, అ సహానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ఐటిఐఆర్‌ను పునరుద్ధరించడం లేదా అంతకు మించి మే లైన మరొక కార్యక్రమాన్ని చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కేంద్రం తరుచూ చెబుతున్న విధంగా మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటిఐఆర్ ప్రారంభిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఐటిఐఆర్ ని పునరుద్ధరించాలన్నారు. తద్వారా రాష్ట్రంలో అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి రాసిన లేఖలో మంత్రి కెటిఆర్ కోరారు. 2008లో కేంద్ర ప్రభుత్వం ఐటిఐఆర్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుందన్నారు.

ఇందుకు సంబంధించి 2010లో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయడం జరిగిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాసిన లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఐటిఐఆర్ కోసం 49వేల ఎకరాలతో పాటు మూడు క్లస్టర్‌లను హైదరాబాద్‌లో గుర్తించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తద్వారా అనేక నూతన ఐటి కంపెనీలను నగరానికి రప్పించేందుకు, పెట్టుబడులకు ప్రోత్సాహకంగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. సుమారు రూ. 3275 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఇందుకు సంబంధించి రెండు దశల్లో ఈ నిధులను ఖర్చు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని మంత్రి కెటిఆర్ తెలిపారు.
ఇందులో భాగంగా మొదటి దశ కార్యక్రమానికి సంబంధించి రూ. 165 కోట్లతో 2018 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. మిగిలిన రెండవదశ కు సంబంధించి వివిధ దశలుగా 20 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఐటిఐఆర్ మొదటిదశలో భాగంగా గుర్తించిన పలు అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రైల్వే, రోడ్డు ట్రాన్స్‌పోర్టు శాఖలకు
సంబంధించి అదనపు బడ్జెట్ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే వస్తున్నదన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభం కాలేదని కెటిఆర్ తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఐటిఐఆర్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదన్నారు.
2014లో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటిఐఆర్ ప్రాజెక్టు నమూనాని సమీక్షించి, మరింత మేలైన పథకాన్ని తీసుకొస్తామని చెప్పారన్నారు. 2017లో ఇందుకు సంబంధించి ఐటిఐఆర్ భాగస్వాములతో విస్తృత స్థాయి చర్చలు జరిపినా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాలేదని ఆ లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఐటిఐఆర్‌పైన ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు విజ్ఞప్తులు కూడా చేశారన్నారు. గత ఆరు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత కీలకమైన కార్యక్రమం పైన ఎలాంటి స్పందన రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఐటి పరిశ్రమకు సంబంధించి ఇంతటి ప్రాధాన్యత కలిగిన అంశం పైన ఎలాంటి స్పందన లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటి రంగంలో గొప్ప వృద్ధిని రాష్ట్రం సాధించిందన్నారు. 2014 లో ఉన్న రూ.57,258 కోట్ల ఐటి ఎగుమతులను 2019..2020 నాటికి రూ. 1,28,807 కోట్లకు పెరిగేలా చేశామన్నారు. మొత్తంగా తెలంగాణ గత ఆరు సంవత్సరాలు స్థూలంగా 110 శాతం వృద్ధిని సాధించిందన్నారు. ఇది జాతీయ సగటు కన్నా ఎంతో ఎక్కువ అని తెలిపారు. ఐటి ఉద్యోగుల సంఖ్య సైతం దాదాపుగా రెట్టింపు అయిందన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ వంటి సంస్థలు నగరాన్ని తమ పెట్టుబడులకు గమ్య స్థానంగా ఎంచుకున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ఆయన గుర్తు చేశారు.
కేవలం పెట్టుబడులను ఆకర్షించడంలోనే కాకుండా నూతన టెక్నాలజీ లైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనలిటిక్స్, ఐఒటి, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీస్, గేమింగ్, యానిమేషన్, గ్రాఫిక్స్, బ్లాక్ చైన్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. దీంతోపాటు ఇన్నోవేషన్ రంగంలోనూ టి హబ్, టి వర్క్, వి హబ్, టాస్క్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రం చేపట్టిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ ఐటి పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించగలిగాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక రంగం మందగించడం వల్ల (గ్లోబల్ ఎకనామిక్ స్లో డౌన్) కోవిడ్ సంక్షోభం వలన కంపెనీలు తిరిగి తమ పూర్వస్థితికి వెళ్లేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
ఇలాంటి కీలక సమయంలో హైదరాబాద్ నగరానికి ఐటిఐఆర్ పథకాన్ని లేదా అంతకు మించి మెరుగైన కార్యక్రమాన్ని అందిస్తే ఐటి పరిశ్రమ, దాని వృద్ధికి బలమైన ఊతం ఇస్తుందని తెలిపారు.

KTR Letter to Centre for ITIR in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News