పారిశుద్ధ కార్మికులు, డిఆర్ఎఫ్ సిబ్బంది సేవలను ప్రశంసించిన మంత్రి కెటిఆర్
కరోనా కాలంలో వైద్యులు, పోలీసు సిబ్బందికి దీటుగా పనిచేస్తున్నారని అభినందనలు
మన తెలంగాణ/హైదరాబాద్: సంజీవయ్య పార్కు ఎదురుగా ఉన్న డిఆర్ఎఫ్ శిక్షణా కేంద్రంలో బుధవారం శానిటేషన్, డిఆర్ఎఫ్, ఎంటమాలజి సిబ్బందితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు భోజనం చేశారు. లాక్ డౌన్ సమయంలో వైద్యులు, పోలీస్లకు ధీటుగా పనిచేస్తున్నారంటూ వారిని అభినందించారు. సామాజిక దూరం పాటిస్తూ ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మంత్రి కెటిఆర్ ప్రతి కార్మికుడుని పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. కొంత మందికి ఆయనే స్వయంగా వడ్డించారు. కుటుంబల సభ్యుల ఆరోగ్య పరిస్థితిని, వారు ఏం చేస్తున్నారని అడిగి తెలుసు కున్నారు. కరోనా మహమ్మారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా నియంత్రణకు విశిష్ట సేవలు అందిస్తున్న శానిటేషన్, ఎంటమాలిజి, డిఆర్ఎఫ్ సిబ్బందికి కూడా పూర్తి జీతంతో పాటు ప్రొత్సాహకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ఇస్తున్నారని గుర్తుచేశారు.
ప్రజల కొరకు నిరంతరం పనిచేసే వారికి ప్రభుత్వం గౌరవిస్తుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ చుట్టపక్కల వారికి వివరించాలని మంత్రి కోరారు. వర్షాకాలం రాబోతున్నందున దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ఎంటమాలిజి విభాగానికి మంత్రి కెటిఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఎల్ఎ బాల్కసుమన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్, ఇవిడిఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, శానిటేషన్ అదనపు కమిషనర్ రాహుల్రాజ్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ముందుండి పోరాడుతున్న @GHMCOnline క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి సహపంక్తి భోజనం చేసిన మునిసిపల్ శాఖ మంత్రి @KTRTRS pic.twitter.com/2fFCgeKP7e
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 22, 2020
KTR Lunch with GHMC Workers at Sanjeevaiah Park