Sunday, April 28, 2024

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం దేశంలో ఎక్కడ లేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారతదేశంలో ఎక్కడ లేదని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంపైన రాష్ట్ర సచివాలయంలో ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కార్యలయంలో జరిగిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు. హైదరాబాద్ నగరం ఒక్కొక్క 50 లక్షల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదల కోసం ఉచితంగా అందిస్తున్నాం. హైదరాబాద్లో నిర్మాణం చేస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విలువ రూ.9100 కోట్లు. ప్రభుత్వానికి అయిన ఖర్చు 9100 కోట్లు, కానీ వాటి మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు పైననే. హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు సుమారు రూ.50,000 కోట్లకు పైగా విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం మాది.

ఇంత పెద్ద కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి అధికారులు కష్టపడి పూర్తి చేస్తున్నారు, వారికి అభినందనలు. మొదటి దశ 11,700 వేల ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించాం. ఈనెల 21వ తేదీన రెండవ దశ దాదాపు మరో 13,300 ఇండ్లను మరోసారి అందించనున్నం. అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందిస్తున్నం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను పూర్తిస్థాయి బాధ్యత అధికారులకే అప్పగించింది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నాము, లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మీడియా ముందు నిర్వహిస్తున్నాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదే. తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం.

ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఇండ్ల ఎంపికలో ఏదైనా ఇబ్బందులు జరిగితే వాటిని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నా. నగరంలో గృహలక్ష్మి పథకం కూడా త్వరలో ప్రారంభమవుతుంది. నగరంలో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పు చేర్పులు చేయాలని మంత్రులు ముఖ్యమంత్రిని కోరారు. వారు సూచించిన మార్పులకు ముఖ్యమంత్రి సూచనప్రాయంగా అంగీకరించారు. హైదరాబాద్ నగరంలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయి. 58, 59 జీవోల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించింది.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం, పట్టాల రెగ్యులరైజేషన్, నోటరీ ఆస్తుల అంశం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గానికి కనీసం 15 నుంచి 20వేల మందికి లబ్ధి కలిగింది. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్తాం అని తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News