Wednesday, May 1, 2024

మన హైదరాబాద్ పాక్‌లో ఉందా?

- Advertisement -
- Advertisement -

KTR road show in GHMC elections

 

బిజెపి సర్జికల్ జోక్‌పై మండిపడ్డ కెటిఆర్

సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్నారు, హైదరాబాద్ భారతదేశంలో లేదా?
కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
ప్రశాంత నగరంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు
భాగ్యనగరం శాంతి సామరస్యాలతో తులతూగకపోతే
పెట్టుబడులు రావు, సాగుతున్న అభివృద్ధి నిలిచిపోతుంది
ప్రజలు నగరాభివృద్ధికి ఓటేయాలి
– ముషీరాబాద్, అంబర్‌పేట రోడ్
షోలలో మంత్రి కెటిఆర్

వరద సాయం అందని వారికి 4 నుంచి పంపిణీ

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, పిల్లలకు కొలువులు వస్తాయని ఎట్టి పరిస్థితుల్లో ఆగం అయ్యే హైదరాబాద్‌ను కోరుకోవద్దని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ అన్నారు. కొత్తగా నిన్న మొన్న మార్కెట్లోకి వచ్చిన వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారని మండిపడ్డారు. హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం చేశారు. హైదరాబాద్ పాకిస్తాన్‌లో ఉందా? అని ఈ సందర్భంగా బిజెపి నాయకులను ఆయన ప్రశ్నించారు.

జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ముషీరాబాద్, అంబర్‌పేట్ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ఆయన రోడ్ షా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ప్రజలు నీరాజనాలు పలికారు. ముఖ్యంగా మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్ షోకు తరలి వస్తున్నారు. దీంతో రహదారులన్నీ జనసంద్రంగా మారుతున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీ నగర్ చౌరస్తా, రామ్ నగర్ క్రాస్ రోడ్స్ మీదుగా అంబర్‌పేట్‌కు చేరుకున్నారు. ఆ నియోజకవర్గంలో అలీ కేఫ్, లింగంపల్లి చౌరస్తా , కాచిగూడ చౌరస్తా తదితర ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షో లలో పాల్గొని ప్రసంగించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. ఇందుకోసం పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఒక్కరికి మంచినీటి అందజేశామన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణం సమయంలో పెద్దన్నగా సిఎం కెసిఆర్ లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నారన్నారు.

అలాగే ఆసరా పింఛన్లు హైదరాబాద్ పట్టణంలో మంచి నిర్మాణం రోడ్లు, ఎల్‌ఈడి లైట్లు, రింగ్ రోడ్లు, ఫ్రెండ్లీ పోలీస్ షీ టీం మహిళలకు రక్షణ తీసుకొచ్చి శాంతియుతమైన హైదరాబాద్ నెలకొల్పామన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉండడం బిజెపి నాయకులకు నచ్చడం లేదన్నారు. ఏదో ఒక విధంగా ప్రజల్లో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. దాని కోసం గుంటకాడి నక్క వలే కాచుకుని కూర్చున్నారని విమర్శించారు. కరోనా సమయంలో గానీ, హైదరాబాద్ వరదలకు మునిగిన సమయంలో ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా బియ్యంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి1500 ఆర్థిక సహాయం అందజేశారని గుర్తు చేశారు. అలాగే ఇటీవలి వర్షాల కారణంగా ఇల్లు మునిగిపోయిన ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి రూ. 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. దీనిని ప్రతిపక్షాలు అడ్డుకున్నప్పటికీ గ్రేటర్ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ పంపిణి చేస్తామన్నారు. దీని కోసం ప్రజలు ఎవరూ పడవద్దని భరోసా ఇచ్చారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు సిఎం కెసిఆర్ రాత్రింభవళ్ళు శ్రమిస్తున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. ఇందులో భాగంగా నగరంలో ఎలాంటి మతకల్లోలు లేకుండా తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగానే టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరంలో మతఘర్షణలు జరగలేదన్నారు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడం వల్ల ప్రపంచ దేశాల్లో అగ్రశేణి సంస్థలుగా కొనసాగుతున్న గూగుల్, అమెజాన్ ఆపిల్ వంటి సంస్థలు వేల కోట్లు పెట్టుబడి పెట్టి హైదరాబాద్‌లో తమ వ్యాపారాలను కూడా ప్రారంభించాయన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూసే విధంగా తీర్చిదిద్దుతామని మంత్రి కెటిఆర్ అన్నారు.

ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామన్నారు. కానీ లెక్కలోకి వెళితే రాష్ట్రం ద్వారా వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లిన సొమ్ము అక్షరాలా రూ.2 లక్షల 72 వేల కోట్లన్నారు. తిరిగి తెలంగాణ ప్రజలకు కేవలం సగం మాత్రమే వస్తున్నాయన్నారు. ఢిల్లీలోని బిజెపి సర్కార్ హైదరాబాద్ కోసం చేసిన కనీసం ఒక పనిని అయినా చూపెట్టి ప్రజలను ఓట్లు అడగాలి అని కిషన్ రెడ్డిని మంత్రి కెటిఆర్ నిలదీశారు. కర్ణాటక, అహ్మదాబాద్ లో వరదలు వస్తే వందల కోట్లు కేంద్రం ఇచ్చిందని కానీ హైదరాబాద్ నగరంలో వరద సాయం కోసం సిఎం కెసిఆర్ కేంద్రానికి ఉత్తరం రాస్తే కేంద్రం నుండి ఒక్కపైసా రాలేదన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు గాజులు చేయించినట్లుగా బిజెపి నేతల మాటలు ఉన్నాయని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న వరద సాయాన్ని ఆపిన బిజెపి నేతలు, వాళ్లకు ఓట్లేస్తే రూ.25 వేలు ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు. వరద సాయం అందుకోని అర్హులకు డిసెంబర్ 4 వ తేదీ నుండి తిరిగి పంపిణీ ప్రారంభిస్తామని తెలియజేశారు.

పేదవారికి సహాయం చేసే దమ్మున్న నేత

పేదవారికి సహాయం చేసే దమ్మున్న నాయకుడు సిఎం కెసిఆర్ అని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. నగరంలో 20 వేల లీటర్లలోపు మంచినీళ్లు వాడుకునే వాళ్లకు నల్లా చార్జీలు మాఫీ చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని అన్నారు. పేద ప్రజల విషయంలో ఎంతో విశాలంగా ఆలోచించే నాయకుడు మన సిఎం అని తెలిపారు. ఆరేళ్లుగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాలంటే గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల కిందట మేము చేసిన విజ్ఞప్తిని మన్నించి 99 సీట్లను కట్టబెట్టిన ప్రజలు హైదరాబాద్ నగర ప్రజలు మీరు. ఐదేళ్లలో మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్ నగరంలో మంచి నీటి సమస్య ఎలా ఉండేదో ఒకసారి ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చే పరిస్థితి.

మంచి నీటి ట్యాంకర్ల దగ్గర యుద్దాలు మనకు తెలియదా అన్నారు. గత పాలకుల పాలనలో మంచినీరు, మురుగు నీరు కలిసి ఆ నీళ్లను తాగిన ప్రజలు ఇదే భోలక్‌పూర్‌లో 9 మంది మృతి చెందిన దారుణ ఘటనలను చూశామన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. కెసిఆర్ నాయకత్వంలో ప్రజల కనీస అవసరమైన మంచినీటి కష్టాలను తీర్చుకున్నామన్నారు. బస్తీ దవాఖానాలు, కల్యాణ లక్ష్మి పథకాలతో పేద ప్రజలకు అండగా ఉంటున్నామన్నారు. నగరంలో గత ఆరేళ్లుగా గుడుంబా గబ్బు లేదు, పేకాట క్లబ్బు లేదు, శాంతి భద్రతలకు ఢోఖా లేదన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ నగరానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. కరెంటు కష్టాలతో నాడు తల్లడిల్లినం.. పవర్ హాలీడేలకు వ్యతిరేకంగా నాణ్యమైన విధ్యుత్ సరఫరా చేయాలనీ ఏకంగా పారిశ్రామిక వేత్తలు ఇందిరా పార్కు వద్ద చేసిన ధర్నాలు గుర్తుచేశారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్ పాలనలో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా నిరంతరం ఎలాంటి ఆటంకం లేకుండా పవర్ హాలిడేలకు స్వస్తి పలికి నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు.

ఒకప్పుడు కరెంటు ఉంటె వార్త. ఇప్పుడు కరెంటు పొతే వార్త అని గొప్పగా చెప్పుకునే స్థాయికి చేరుకున్నామన్నారు. నగర ప్రజల అవసరాల పట్ల అవగాహన ఉన్న నాయకుడు కెసిఆర్ అని అన్నారు. వందేండ్ల కిందట 1920లో నిర్మించిన గండిపేట జలాశయం తప్ప ఇప్పటివరకు నగర ప్రజల అవసరాల కోసం ఏ ఒక్క పాలకుడు ఆలోచించలేదన్నారు. కానీ నగర ప్రజల అవసరాలు, భవిష్యత్ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దానికి రెట్టింపు సామర్థ్యంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేశవాపురం రిజర్వాయర్ ని నిర్మిస్తున్నారన్నారు. 65 ఏళ్ల గబ్బు ఆరేళ్లలోపు పోతుందా ? అని గత పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్‌లో ట్రాఫిక్ కష్టాలకు చరమగీతం పాడుతూ త్వరలోనే నాలుగు వందల కోట్లతో రోడ్ల అభివృద్ధి చేపడతామన్నారు. ఇందుకు సంబంధించిన రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం అవుతాయన్నారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి భాగ్యనగరంలో అభివృద్ధిని సరికొత్త పుంతాలు తొక్కిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News