Tuesday, April 30, 2024

లష్కరే కమాండర్‌ను మట్టుబెట్టిన సైన్యం …

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు మధ్య ఏడు రోజులుగా జరుగుతోన్న ఎన్‌కౌంటర్ కొలిక్కి వచ్చింది. లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్‌ను హతమార్చడంతో ఈ ఎన్‌కౌంటర్ ముగిసింది. అతడిని మట్టుపెట్టిన విషయాన్ని ఏడీజీపీ పోలీస్ విజయ్ కుమార్ ధ్రువీకరించారు. కాల్పులు ముగిసిన తరువాత భద్రతా సిబ్బంది రెండు మృతదేహాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు మృతదేహాల్లో ఒకటి ఉజైర్‌ఖాన్‌ది అని తెలిపారు. అనంతనాగ్ జిల్లా లోని కొకెర్‌నాగ్ ప్రాంతంలో దాక్కున్న ముష్కరులను ఏరివేసేందుకు భద్రతా సిబ్బంది గత మంగళవారం వేట మొదలు పెట్టారు. ఆ మరుసటి రోజు (సెప్టెంబర్ 13) ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు నక్కి ఉన్నట్టు సమాచారం అందింది.

దీంతో కర్నల్ మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లి దాడి మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. తూటాలు తగలడంతో కర్నల్ మన్‌ప్రీత్ సింగ్‌తోపాటు మేజర్ ఆశిష్ ధొనక్, జమ్ముకశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన డీఎస్పీ హుమయూన్ భట్‌లు అమరులయ్యారు. అదే ఘటనలో ఓ జవాన్ ఆచూకీ గల్లంతయ్యింది. సెప్టెంబర్ 18 ఆ జవాను భౌతిక కాయాన్ని పోలీస్‌లు గుర్తించారు. అతడు పంజాబ్‌కు చెందిన సిపాయి ప్రదీప్ కుమార్ అని అధికారులు తెలిపారు. గత దశాబ్దకాలంలో సుదీర్ఘంగా జరిగిన ఎన్‌కౌంటర్ ఇదేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉజైర్ అనంతనాగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతడు 26 జులై 2022 నుంచి ఆచూకీ లేడని తెలుస్తోంది. లష్కరే కమాండర్‌గా ఉన్న అతడి కథ ఈ రోజుతో ముగిసి పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News