Monday, May 6, 2024

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

తీర్పు చెప్పిన ఎల్‌బి నగర్ కోర్టు

మనతెలంగాణ, సిటిబ్యూరోః వరుసకు సోదరి అయిన మహిళపై కిరోసిన్ పోసి హత్య చేసిన నిందితులకు జీవిత ఖైదు శిక్ష, రూ.3,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం….శంషాబాద్, పెద్దగోల్కొండ గ్రామానికి చెందిన నక్కా మంజుల(30) భర్త మహేష్‌ను ఆమె సోదరులు హత్య చేశారు. ఈ హత్య విషయంలో ఆమెకు వారు రూ.3,50,000 పరిహారం ఇచ్చారు.

మహేష్ హత్య కేసులో మల్లయ్య, శంకరమ్మ, రమేష్ నిందితులుగా ఉన్నారు. డబ్బులు ఇచ్చినప్పటి నుంచి మంజులతో వారు గొడవపడుతున్నారు. ఈ క్రమంలోనే జూలై,25, 2017వ తేదీన మంజుల ఉద్యోగానికి వెళ్లి తిరిగి వస్తుండగా గొడవపెట్టుకుని, భూతులు తిట్టారు, దాడి చేశారు. అందరూ కలిసి మంజుల ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అప్పటి శంషాబాద్ ఇన్స్‌స్పెక్టర్ కృష్ణప్రసాద్ వాంగ్మూలం తీసుకున్నారు.

నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో నిందితులపై 302 ఐపిసి కింద కేసు నమోదు చేశారు. కేసు కోర్టులో విచారణ జరగుతుండగా ఫ్రధాన నిందితుడు మల్లయ్య మృతిచెందాడు. మిగతా వారు నక్కా శంకరమ్మ, నక్కా రమేష్‌కు జీవిత ఖైదు జైలు శిక్ష విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News