Sunday, April 28, 2024

గూడూరు-మనుబోలు మధ్య అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే తన రైలు నెట్‌వర్క్ పరిధిలోని విస్తరిస్తూ గూడూరు – మనుబోలు మధ్య అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్‌ను విస్తరించింది. రైలు కదలికలను సులభతరం చేయడానికి, రైలు మౌలిక సదుపాయాలను నిరంతరం అభివృద్ధి చేయడానికి యత్నిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఇందులో భాగంగా విజయవాడ డివిజన్‌లోని గూడూరు- మనుబోలు రైల్వే స్టేషన్‌ల మధ్యకొత్తగా అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్‌ను ప్రారంభించుకుంది. గూడూరు- మనుబోలు మధ్య మూడో లైన్ పనుల్లో భాగంగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ ఆర్. ఓ.ఆర్ ఫ్లై ఓవర్‌ను నిర్మించింది. 2.2 కి.మీల నిడివితో నిర్మించిన ఈ రైల్ ఫ్లైఓవర్ దక్షిణ మధ్య రైల్వేలో 7వ ఆర్‌ఓఆర్‌గా నిలిచింది. ఇంతేకాకుండా ఇది జోన్‌లో అతి పొడవైన ఆర్‌ఓఆర్/రైల్ ఫ్లైఓవర్ కూడా కావడం గమనార్హం.

గతంలో జోన్‌లో అత్యంత పొడవైన రైల్ ఫ్లైఓవర్ 40 మీటర్లు మాత్రమే ఉండేది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 2.2 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ ఫ్లైఓవర్‌ను కేవలం రెండేళ్ల వ్యవధిలో నిర్మించారు.ఈ ఫ్లైఓవర్ పిఎస్‌సీ (ప్రీ- స్ట్రెస్డ్ కాంక్రీట్), కాంపోజిట్ గర్డర్‌లను కలిగిఉంది. ఇది స్వాభావికమైన అధిక ప్రవాహ సామర్థ్యం కలిగి మరియు తక్కువ నిర్వహణ ఖర్చులతో నిర్మించబడినది. దీని నిర్మాణానికి అదనంగా ఫ్లైఓవర్ యొక్క సబ్‌స్ట్రక్చర్, పిఎస్‌సి గిర్డర్‌లు స్లాబ్‌లకు హై గ్రేడ్ కాంక్రీట్, స్ట్రక్చరల్ స్టీల్‌ను ఉపయోగించారు. వంతెన కొలతలు అందుబాటులో ఉన్న రైల్వే భూమిలో ప్రాజెక్టును సజావుగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. గ్రాండ్ ట్రంక్ రూట్‌లో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్ ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ రైల్వేల మధ్య వివిధ రైళ్ల రాకపోకలకు ఇంటర్‌చేంజ్ పాయింట్‌గా ఉండనుంది. నిరంతరం రైళ్ల రాక పోకలతో రద్దీగా ఉన్న ఈ విభాగంలో రైళ్ల కదలికలను సులభతరం చేయడానికి ఈ కొత్త రైలు ఫ్లైఓవర్ సహాయపడుతుంది.

ఈ ఫ్లైఓవర్ ప్రారంభించడం వల్ల గూడూరు స్టేషన్ మీదుగా విజయవాడ నుండి రేణిగుంట, చెన్నై నుండి విజయవాడ మధ్య ఏకకాలంలో నడిచే రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్ ఫ్లైఓవర్‌ను నిర్మిoచినందుకు దక్షిణ మధ్య రైల్వే , ఆర్‌విఎన్‌ఎల్ అధికారులను అభినందించారు. గూడూరు స్టేషన్ ప్రధాన జంక్షన్‌గా రైళ్ల రాకపోకల సంఖ్య ఎక్కువగా ఉండటంతోపాటు ఇంటర్‌చేంజ్ పాయింట్ కావడంతో ఈ రకమైన రైలు వంతెన ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. రద్దీగా ఉండే గూడూరు స్టేషన్ వద్ద రైళ్లు వేచి ఉండే సమయాన్ని ఎంతగానో తగ్గించడంలో ఇది సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News