Friday, April 26, 2024

పురుగుల మందు తాగిన ప్రేమికులు

- Advertisement -
- Advertisement -

Lovers couple drinking poison:1 died

మన తెలంగాణ/వరంగల్ : పెద్దలు కుదిర్చిన పెళ్లితో ప్రేమికులైన జంట పెళ్లి కాకపోవడంతో ఇరువురు కలిసి పురుగుల మందు తాగారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధస్రుతండాలో శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గీసుకొండ మండలం మంగలితండాకు చెందిన భూక్య బాలు- కమల దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతూరును ములుగు జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపారు. రెండో కూతురు సంగీతను కూడా అదే గ్రామానికి చెందిన నునావత్ రాజేందర్‌తో వివాహం చేసేందుకు సంబంధం కుదుర్చుకున్నారు. ఆ తరువాత ఇద్దరు కూతుళ్లను ఒకే గ్రామానికి ఇవ్వకూడదని నిర్ణయించి సంగీతను ధస్రుతండాకు చెందిన మరో వ్యక్తితో వివాహం జరిపించారు.

అంతకుముందే రాజేందర్, సంగీతలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. విషయం తెలియక తల్లిదండ్రులు మరో వివాహం చేయగా శుక్రవారం ఉదయం రాజేందర్ పురుగుల మందు బాటిల్ తీసుకొని సంగీత వద్దకు వచ్చాడు. ఇంట్లో అత్తమామలు ఎవరూ లేకపోవడంతో సంగీత రాజేందర్‌లు ఇంట్లో మాట్లాడుకొని పురుగుల మందు తాగి పడిపోయారు. విషయాన్ని స్థానికులు గమనించి వారిని హుటాహుటిన వరంగల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేందర్ మృతిచెందగా.. సంగీత పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న గీసుకొండ సిఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News