Monday, April 29, 2024

చైనా వైరస్ హచ్9ఎన్2 తో పెద్ద ముప్పులేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చైనాలో తలెత్తిన శ్వాసకోశ వ్యాధి న్యూమోనియా తీవ్రత పట్ల భారతదేశం దృష్టి సారించింది. చైనాలో ఇప్పుడు హెచ్9ఎన్ 2 (ఎవియన్ ఇంఫ్లూయెంజా వైరస్ ) తలెత్తింది. ఈ వైరస్ జనిత అనారోగ్యం గురించి అంతర్జాతీయ ప్రయాణాల నేపథ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ఉన్నత స్థాయిలో విశ్లేషణకు దిగారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ మేరకు దీనికి సంబంధించి శుక్రవారం ఓ ప్రకటన వెలువరించింది. ఇటీవలి కాలంలో న్యూమోనియా వంటి వ్యాధి లక్షణాలతో చైనాలో అత్యధిక సంఖ్యలో జనం తల్లడిల్లుతున్నారు. పలు ఆసుపత్రులు ఇప్పుడు ఈ రోగలక్షణాలతో వచ్చిన వారితో కిటకిటలాడుతున్నాయి. కరోనా నేపథ్యంలో అందులోనూ చైనా నుంచే ఈ వైరస్ వ్యాప్తి చెందిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు ఇండియాలో అన్ని రకాల జాగ్రత్తలకు చర్యలు చేపట్టనున్నారు.

పరిస్థితిని అనుక్షణం గమనిస్తున్నట్లు అధికారులు వివరించారు.ప్రత్యేకించి పిల్లల్లో తీవ్రస్థాయిలో శ్వాసకోశ సమస్యలు తలెత్తడం ఇప్పుడు చైనాలో ఆరోగ్యపరంగా సవాళ్లకు దారితీసింది. ఉత్తరచైనా ప్రాంతం ఇప్పుడు ఎక్కువగా ఈ అనారోగ్య తీవ్రతకు గురైంది. అయితే ఎవియన్ ఇంఫ్లూయెంజతో మన దేశంలో పెద్దగా సమస్య ఉండబోదని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏది ఏమైనా సరైన నివారణ చర్యలు అవసరం అని భావించి ఇప్పుడు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాల్సి ఉందని నిర్ణయించారు. కేవలం న్యూమోనియానే కాకుండా ఇతరత్రా అంతుచిక్కని శ్వాసకోశ వ్యాధులు తలెత్తడంతో చైనా ఇప్పుడు అప్రమత్తం అయింది. చైనా తరహా శ్వాసకోశ వ్యాధి లక్షణాలు ఇప్పటికైతే ఇండియాలో ఎక్కడా తలెత్తలేదు. అయితే దూర ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రయాణికులతో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వ్యాపించే ముప్పు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

మనిషి నుంచి మనిషికి రిస్క్ తక్కువే ః డబ్లుహెచ్‌ఒ
ఇప్పుడు చైనాలో తలెత్తిన ఇంఫ్లూయెంజా వల్ల మనుష్యుల నుంచి మనుష్యులకు ఇది వ్యాపించే అవకాశం తక్కువగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అదే విధంగా దీని వల్ల ప్రాణాంతక సమస్యలు ఏమీ ఉత్పన్నం కాబోవని వివరించారు. హెచ్9ఎన్2 వల్ల చైనాలో కానీ ఇతర చోట్ల కానీ ఇప్పటికైతే ఎక్కడా మరణాలు సంభవించలేదు. అయితే ఇది సోకితే పలువురికి తలెత్తే శ్వాసకోశ సమస్య చాలా రోజుల వరకూ వీడకుండా ఉండటం క్లిష్టతకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News