రాష్ట్రపతి కోవింద్ ఆవేదన
న్యూఢిల్లీ : దేశ రక్షణ పరిశోధనా రంగం సిబ్బందిలో మహిళలకు అత్యల్ప ప్రాతినిధ్యం ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. ఆర్ అండ్ డి రంగంలో ఇప్పటి లెక్కలు చూస్తే కేవలం 15 శాతం మంది మహిళలకు స్థానం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి దారుణం అని రాష్ట్రపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా, పరిశోధనా, అభివృద్థి సంస్థలలో లింగపరమైన న్యాయం పాటించే దిశలో చేపట్టిన మూడు కార్యక్రమాలను రాష్ట్రపతి శుక్రవారం ప్రారంభించారు. ఓ వైపు ఇస్రో పరిశోధనలలో మహిళా శాస్త్రవేత్తలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నారు. అంగారక యాత్రలో, చంద్రయాన్ 2లో కూడా వారి పాత్ర ఎంతో ఉందని అన్నారు.
జాతీయ సైన్స్డే సందర్భంగా శాస్త్రజ్ఙనులనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. అయితే వివిధ స్థాయిల్లో రక్షణ పరిశోధనా రంగంలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్కాల్సి ఉందన్నారు. అంకితభావంతో పనిచేసే మహిళా శాస్త్రజ్ఞులు ఎంతో మంది ఉన్నారని తాను గుర్తించినట్లు , చివరికి ఓ మహిళ తన ఆరునెలల కొడుకును కూడా ఇంట్లో వదిలిపెట్టి ఖగోళ పరిశోధనల కోసం విధులకు హాజరయ్యారని, అయితే ఆర్డిలో క్షేత్రస్థాయిలో మనం కల్పించే ప్రాతినిధ్యం కేవలం 15 శాతమే ఉండటం చాలా దారుణం అని రాష్ట్రపతి తెలిపారు. శాస్త్రీయ రంగంలో మహిళలకు ప్రాధాన్యత కోసం ఆన్లైన్ పోర్టల్ ‘గతి’ మరికొన్ని పథకాలను ఆయన ప్రారంభించారు.