Monday, April 29, 2024

నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఆన్‌లైన్ ఆర్డర్ పేరుతో అమెరికా పౌరులను బెదిరించి అందినకాడికి దోచుకుంటున్న మూడు నకిలీ కాల్ సెంటర్ ఉదోగులను సైబరాబాద్ మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. 115మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ఏడుల్యాప్‌టాప్‌లు, 115సిపియూలు, మానిటర్లు, రౌటర్లు, 120 మొబైల్ ఫోన్లు, ఆడి కారు, రూ.2,55,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర గచ్చిబౌలిలోని కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఎండి అన్సారి మోహిర్‌ఫాన్ ఎఆర్‌జే సోల్యూషన్ ఏర్పాటు చేశాడు. గంచిఅకీబ్ ఎజి సొల్యూషన్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ప్రదీప్ వినోద్ రాథోడ్ వర్టేజ్ సొల్యూషన్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఉస్మాన్, శివం ప్రధాన్, దీపు థాపర్ మూడు కంపెనీల్లో కీలక వ్యక్తులు.

వీరు గుజరాత్ నుంచి వచ్చి మాదాపూర్‌లో మూడు నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో పని చేసేందుకు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన వారిని టెలీ కాలర్లుగా తీసుకున్నారు. నిందితులు కాల్‌సెంటర్స్ ఇండియా. కామ్,లోకల్‌బిట్‌కాయిన్.కామ్, పాక్స్‌ఫుల్ ద్వారా అమెరికాకు చెందిన పౌరుల వ్యక్తిగత డేటా తీసుకుని విఓఐపి కాలింగ్ సర్వీస్ ప్రొవైడర్ విసి డయల్ ఉపయోగించి ఫోన్లు చేస్తున్నారు. తాము కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సెల్ డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడుతున్నామని మీకు అనుమానస్పద పార్సిల్ వచ్చిందని బెదిరిస్తున్నారు. బయపడిన వారికి దీనిని నుంచి బయటపడేయాలంటే వెంటనే కొంత మొత్తం చెల్లించాలని చెప్పి బాధితుల నుంచి 3,000 డాలర్ల నుంచి 6,000 డాలర్ల వరకు వసూలు చేస్తున్నారు. మరో కేసులో కాల్ సెంటర్ ఉద్యోగులు అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారం పేరు, చిరునామా, నగరం తదితర సమాచారం సేకరిస్తున్నారు. తర్వాత బాధితులకు ఫోన్ చేసి అమెజాన్‌లో వస్తువులను ఆర్డర్ చేశారని అన్ని ప్రశ్నిస్తున్నారు.

తాము ఎలాంటి ఆర్డర్ చేయలేదని, చెప్పడంతో లేదు మీ పేరుపై ఆర్డర్ ఉందని క్యాన్సిల్ చేస్తే యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని బెదిరిస్తున్నారు. ఇలా బెదిరిన వారి వద్ద నుంచి డాలర్లను వసూలు చేస్తున్నారు. బెదిరిన వారితో పార్సిల్ వాపసు చేయడానికి అమెజాన్, యాపిల్ కంపెనీ గిఫ్ట్ కార్డు కొనుగోలు చేసి పంపించాలని చెబుతున్నారు. అలా కొనుగోలు చేసిన వోచర్‌లను కాల్ సెంటర్ ఉద్యోగులకు చెబుతున్నారు, తర్వాత కాల్ సెంటర్ నిర్వాహకులు రీడిమ్‌కోడ్ వారి నుంచి తెలుసుకుని వాటిని paxful వెబ్‌సైట్‌లో విక్రయిస్తున్నారు. అందులో వచ్చిన డబ్బులను క్రిప్టోకరెన్సీ నుంచి యూఎస్‌డిటి మార్చి వాటిని ఇండియాలోని ఐఎంపిఎస్, యూపిఐ లావాదేవీల ద్వారా పంపిస్తున్నారు. ఇలా రెండేళ్ల నుంచి నిందితులు అమెరికా పౌరులను మోసం చేస్తున్నారు. నిందితులను మాదాపూర్ ఇన్స్‌స్పెక్టర్ తిరుపతి, ఎస్సైలు గౌతం, రవికిరణ్, నర్సింహారావు, వెంకటేష్, శ్వేత తదితరలు పట్టుకున్నారు.

టెలీకాలర్లుగా ఇతర రాష్ట్రాల వారు…
అమెరికా పౌరులకు కాల్ చేస్తున్న వారిలో టెలీకాలర్లు కీలకంగా ఉన్నారు. వీరిని మూడు సంస్థలకు చెందిన ప్రతినిధులు మహారాష్ట్ర, అస్సాం, ఢిల్లీ, నాగాలాండ్ తదితర రాష్ట్రాల వారిని ఎంపిక చేస్తున్నారు. వీరు రోజుకు అమెరికా పౌరులు 22,000మందికి కాల్స్ చేస్తున్నారు. స్పందించిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంత ఇస్తే అంత దోచుకుంటున్నారు. బాధితులను బెదిరించిన తర్వాత తమకు చెందిన వ్యక్తినే అమెరికాకు చెందిన కస్టమ్స్ అధికారిగా మాట్లాడించి మరింత బెదిరిస్తున్నారు. ఇలా ఫోన్లు చేసి నిందితులు ఇప్పటి వరకు 20,733మందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News