Sunday, April 28, 2024

టీమిండియాకు పరీక్ష

- Advertisement -
- Advertisement -

ఫ్లోరిడా: వెస్టిండీస్ శనివారం జరిగే నాలుగో టి20 మ్యాచ్ టీమిండియాకు సవాల్‌గా మారింది. మూడో టి20లో గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు విండీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. విండీస్ ఇప్పటికే సిరీస్‌లో 21 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమవుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సిరీస్ 22తో సమమవుతోంది. ఇక కిందటి మ్యాచ్‌లో అలవోక విజయాన్ని అందుకున్న భారత్ ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. సూర్య మూడో టి20లో మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న సూర్య విజృంభిస్తే ఈసారి కూడా భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి.

యువ ఆటగాడు, తెలుగుతేజం తిలక్‌వర్మ కూడా జోరుమీదున్నాడు. కిందటి మ్యాచ్‌లో కూడా తిలక్‌వర్మ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. సూర్యకుమార్, తిలక్‌వర్మలపై జట్టు భారీ అంచనాలతో ఉంది. వీరు ఎలా ఆడతారనే దానిపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. మరోవైపు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌లు విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. కిందటి మ్యాచ్‌లో యశస్వికి ఛాన్స్ ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. గిల్ కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. ఈసారి యశస్విని ఆడిస్తారా లేకుంటే ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ ఇస్తారా అనేది ఇంకా తేలలేదు. ఇక సంజూ శాంసన్‌కు ఇప్పటికే పలు అవకాశాలు లభించినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోతున్నాడు.

ఈసారైనా అతను మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా మెరుపులు మెరిపించక తప్పదు. అక్షర్ పటేల్ కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో మాత్రం భారత్ బాగానే ఉంది. కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్, అక్షర్ తదితరులు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఈసారి కూడా బౌలర్లే జట్టుకు కీలకమని చెప్పాలి.

విజయమే లక్ష్యంగా..
ఇదిలావుంటే ఆతిథ్య విండీస్ విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి ఈసారి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మరో పోటీ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విండీస్ సమతూకంగా ఉంది. పూరన్, కింగ్, రొమన్ పొవెల్, అకిల్ హుస్సేన్, చార్లెస్, మేయర్స్, హోల్డర్‌లతో విండీస్ బలంగా కనిపిస్తోంది. సమష్టిగా రాణిస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించడం విండీస్‌కు కష్టమేమీ కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News