పెను సంక్షోభంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం
జోతిరాదిత్య, 17మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు అదృశ్యం, బెంగళూరు రిసార్ట్లో బస, సింధియా సహా ఆరుగురు మంత్రుల ఫోన్లు ఆఫ్
బిజెపి పనేనని కాంగ్రెస్ ఆరోపణ, ఖండించిన కమలనాథులు
ఢిల్లీ నుంచి హుటాహుటిన భోపాల్కు ముఖ్యమంత్రి కమల్నాథ్
అత్యవసరంగా కేబినెట్ భేటీ, 16 మంది మంత్రుల రాజీనామా, ఆమోదం
త్వరలో కేబినెట్ విస్తరణ : కమల్నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్లో అంతర్గత పోరాటం జరుగుతోందని, పార్టీ ఎంఎల్ఎలను తమవైపు తిప్పుకునేందుకు మరో పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో… రాజ్యసభ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, ఆయన మద్దతుదా రులుగా భావిస్తున్న కనీసం 17 మంది ఎంఎల్ఎలు సోమవారం నాడు అదృశ్యమయ్యారు. కమల్నాథ్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు… ఎంఎల్ఎ లను వలలో వేసుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని అధికార పార్టీ ఆరోపిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీలో కమల్నాథ్ సర్కార్కు బొటాబొటి మెజారిటీ ఉంది. పైగా, కేబినెట్ను విస్తరించాల్సిన సమయమూ ఆసన్నమైంది.
ఇలా ఉండగా సోమవారం ఢిల్లీలో ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ అప్పటికప్పుడు తన కార్యక్రమాల్ని రద్దు చేసుకొని హడావిడిగా భోపాల్ చేరుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, జ్యోతిరాదిత్య సింధియాను సంప్రదించేందుకు పిటిఐ వార్తాసంస్థ ఫోన్ చేయగా సమాధానం రాలేదు. అలాగే, ఆయనకు మద్దతిస్తున్న ఆరుగురు కేబినెట్ మంత్రుల మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి. వారిలో ఆరోగ్యమంత్రి తుల్సీ సిలావత్, కార్మిక మంత్రి మహేంద్రసింగ్ సిసోడియా, రవాణా మంత్రి గోవింద్సింగ్ రాజ్పుట్, మహిళా శిశు సంక్షేమ మంత్రి ఇమార్తి దేవి, ఆహారం పౌర సరఫరాల మంత్రి ప్రద్యుమ్నసింగ్ తోమర్, పాఠశాల విద్యాశాఖ మంత్రి డాక్టర్ ప్రభురా చౌదరి ఉన్నారు.
ఈ పరిణామం గురించి తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని సంప్రదించగా ‘ఇదేం సీరియస్ విషయం కాదు’ అన్నారు. సోమవారం అంతకు ముందు… రాబో యే రాజ్యసభ ఎన్నికలకు రాష్ట్రం నుంచి ప్రియాంక గాం ధీని నామినేట్ చేయాలని కాంగ్రెస్ నాయకుల్లో ఒక వర్గం డిమాండ్ చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికోసం ఇదివరకు సింధియా, కమల్నాథ్ పోటీపడ్డారు. ప్రస్తుతం ఆ పదవిని ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపైన, మార్చి 26న జరగబోయే రాజ్యసభ ఎన్నికల గురించి పార్టీ అగ్రనాయకత్వంతో చర్చించేందుకు కమల్నాథ్ ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. ఏప్రిల్ 9తో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్సింగ్, బిజెపి నాయకులు ప్రభాత్ ఝా, సత్యనారాయణ్ జతియాల రాజ్యసభ సభ్యత్వ కాలపరిమితి ముగుస్తుంది.
230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాం గ్రెస్, బిజెపి సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే రెండు పార్టీలూ ఒక్కొక్క రాజ్యసభ సీటు గెలుచుకుంటాయి. అసెంబ్లీలో కాంగ్రెస్కు 114 మంది ఎంఎల్ఎలు ఉండగా, బిజెపికి 107 మంది ఉన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు చెందిన ఒక్కో సభ్యుడు మరణించడంతో రాజ్యసభలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. మధ్యప్రదేశ్లో గతవారం పది మంది కాం గ్రెస్ ఎంఎల్ఎలు అదృశ్యం అయినప్పటి నుంచీ రాష్ట్రంలో పొలిటికల్ డ్రామా మొదలైంది. కాంగ్రెస్ పార్టీ బిజెపిపై ఆరోపణలు చేసింది. అయితే బిజెపి వాటిని ఖండించింది. మరోవైపు భోపాల్ చేరుకున్న సిఎం కమల్ నాథ్ తనకు అందుబాటులో ఉన్న 16మంది మంత్రులతో సమా వేశమ య్యారు. ఆ తరాత కాసేపటికి వారంతా రాజీనామా చేశారు. వెంటనే వాటిని ఆమోదిస్తున్నట్టు కమల్నాథ్ ప్రకటించారు. త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని వెల్లడించారు. కొన్ని శక్తుల కుట్రలు సాగనివ్వబోమని అన్నారు.