రాచకొండలో 8,000 పోలీసులతో భద్రత
జిహెచ్ఎంసి 30వార్డుల్లో ఎన్నికలు
రాచకొండ సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, హైదరాబాద్ : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. మల్కాజ్గిరి, ఎల్బి నగర్ జోన్ ఎన్నికల్లో పాల్గొననున్న పోలీసులతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత కూడా ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల భద్రతకు 8,000మంది పోలీసులను నియమించామని తెలిపారు.
వారికి అన్ని రకాల శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే పోలీసుల పని ప్రారంభం అవుతుందని అన్నారు. అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు. ఓటర్ల తమ ఓటును ఎలాంటి భయం లేకుండా వినియోగించుకోవాలని, ఎన్నికలకు సబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ 100, వాట్సాప్ నంబర్ 9490617111కు ఫోన్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రాచకొండ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, డిసిపిలు సన్ప్రీత్సింగ్, రక్షిత మూర్తి తదితరులు పాల్గొన్నారు.