భార్య వచ్చి బతిమాలడంతో కిందకు దిగిన వ్యక్తి
హైదరాబాద్: భార్య కాపురానికి రావడం లేదని, పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఓ వ్యక్తి హోర్డింగ్ టవర్ఎక్కిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని మైలార్దేవ్పల్లికి చెందిన బెల్లంపల్లి రాజు(38)కు పన్నెండేళ్ల క్రితం చాంద్రాయణగుట్టకు చెందిన భాగ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు,. ఒక కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసగామారిన రాజు రోజు మద్యం తాగి రావడంతో దంపతుల మధ్య రెండేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి.
దీంతో విరక్తి చెందిన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. భార్య కాపురానికి వచ్చే విధంగా చేయాలని మైలార్దేవ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దిరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా కూడా భర్త ప్రవర్తన నచ్చకపోవడంతో భార్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉంటోంది. పోలీసులు తన భార్య కాపురానికి వచ్చే విధంగా చేయడం లేదని పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రాజు టవర్ ఎక్కాడు. కిందికి దిగాల్సిందిగా రాయదుర్గం పోలీసులు కోరినా రాజు నిరాకరించాడు. దీంతో వారు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రాజు భార్యను తీసుకువచ్చి నచ్చజెప్పడంతో కిందికి దిగి వచ్చాడు.
Man Climbing Hoarding Tower for Wife in Hyderabad