మనతెలంగాణ/హైదరాబాద్ః ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం షాపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట వెలసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు పోలీసు బలగాలతో అడవులను జల్లడ పట్టడం ఆపాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. కూంబింగ్స్ ఆపకపోతే టీఆర్ఎస్ నాయకుడు భీమేశ్వరరావుకు పట్టిన గతే ఇతర నాయకులకు పడుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో మాజీ మావోయిస్టు ముద్రబోయిన సంపత్ తీరును మావోయిస్టులు ఆక్షేపించారు. సంపత్ తన బొలేరో వాహనంలో పోలీసులను తిప్పడం సరికాదన్నారు. తీరు మార్చుకోకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు డిఆర్వొ ప్రహ్లాద్, రవిందర్, సందీప్లు ఇంకా చాలా మంది తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు తమ వాల్ పోస్టర్లో హెచ్చరించారు. ప్రజల సమస్యలు అడిగితే అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పెంచుతూ ప్రజలపై అక్రమ కేసులు పెడుతున్నాడని మావో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Maoists write letter to stop police kubing in Telangana