Saturday, May 4, 2024

కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పబ్‌జీలో పరిచయమైన యువకుడు వివాహితపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం…ఎపిలోని కోనసీమ జిల్లా, గుండేపల్లి మండలం, పి.నాయక్‌పల్లికి చెందిన యువతికి కపిలేశ్వరపురం మండలం, అంగారా గ్రామానికి చెందిన వసకుమార్ నర్సింహమూర్తితో పబ్‌జీ(బ్యాటిల్ గ్రౌండ్స్ ఇండియా)గేమ్‌లో పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి కొద్ది రోజులు గేమ్‌ను ఆడేవారు. ఈ క్రమంలోనే యువతికి ఆమె గ్రామానికి చెందిన వలంటీర్ జాషువాతో 2020లో వివాహమైంది. వివాహం అనంతరం కూడా నర్సింహమూర్తి యువతిని ప్రేమిస్తున్నానని మెసేజ్‌లు పెట్టడం, ఫోన్ చేసేవాడు. దీంతో వారి కుటుంబంలో కలహాలు ప్రారంభం అయ్యాయి. వాటి పట్ల విరక్తి చెందిన యువతి ఉద్యోగం చేసేందుకు భర్తను వదిలేసి హైదరాబాద్‌కు వచ్చింది. హైదరాబాద్‌లో తన స్నేహితురాలి రూమ్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది.

యువతి హైదరాబాద్‌లో ఉన్న విషయం తెలుసుకున్న నిందితుడు ఇక్కడికి వచ్చి ఆమెను కలిశాడు. స్నేహితురాలి రూమ్‌లో ఉండడం సరికాదని, అమీర్‌పేటలోని హాస్టల్‌లో చేర్పించాడు. తాను కూడా అక్కడికి సమీపంలోని మరో హాస్టల్‌లో చేరాడు. రోజు యువతిని కలిసి నీ భర్తకు విడాకులు ఇవ్వు, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ మాయ మాటలు చెప్పేవాడు. వీటిని నమ్మిన బాధితురాలు జవహర్‌నగర్, మల్లన్నగుట్టలో రూమ్ తీసుకుని ఇద్దరు ఉంటున్నారు. యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించాడు. అది తాగిన యువతి స్పృహ కోల్పోడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించడం ప్రారంభించాడు. తాను చెప్పినట్లు వినకుంటే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో యువతి స్వగ్రామానికి వెళ్లి అంగార బస్‌స్టేషన్‌లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

అక్కడే ఉన్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం విచారణ చేసిన పోలీసులకు తనపై జరిగిన అత్యాచారం గురించి వివరించింది. వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అంగారా పోలీసులు దర్యాప్తు కోసం హైదరాబాద్‌లోని మధురానగర్ పిఎస్‌కు బదిలీ చేశారు. మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News