Friday, April 26, 2024

కరోనా ఆపత్కాలంలోనూ ఔరా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

 సంక్షోభ సమయంలోనూ రాష్ట్రానికి రూ.1200 కోట్ల భారీ పెట్టుబడి
వైద్య పరికరాల తయారీకి ముందుకొచ్చిన ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్‌ట్రానిక్
అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం
ఫలించిన మంత్రి కెటిఆర్ రెండేళ్ల కృషి
దేశానికే మెడ్‌టెక్ హబ్‌గా మారనున్న హైదరాబాద్

Medtronic's Rs.1200 cr Investment in Hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్: మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ కంపెనీ తన పెట్టుబడి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. అమెరికా తరువాత తన రెండో అతిపెద్ద డెవలప్‌మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సుమారు రూ. 1200 కోట్లతో ఉన్న తన పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) కేంద్రాన్ని మరింతగా విస్తరించనుంది. రానున్న ఐదు సంవత్సరాలలో విస్తరణ కోసం ఆ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ పెట్టుబడితో మెడికల్ డివైసెస్ హబ్ గా హైదరాబాద్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పెట్టుబడులను రాబట్టేందుకు మెడ్ ట్రానిక్స్ కంపెనీ గత రెండు సంవత్సరాలుగా ఇందుకు సంబంధించిన చర్చలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. 2016లో అమెరికా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం పర్యటలో భాగంగా మెడ్ ట్రానిక్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఒమర్ ఇస్రాక్ తో సమావేశమై చర్చించింది. కాగా మంగళవారం మరోసారి వర్చువల్ సమావేశంలో ఒమర్‌తో మంత్రి కెటిఆర్ చర్చించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పెట్టుపడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు మంత్రి కెటిఆర్‌కు ఒమర్ వివరించారు. ఈ మేరకు పెట్టుబడికి సంబంధించిన ప్రకటనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఒమర్ మాట్లాడుతూ, పరిశోధన,అభివృద్ధి అనేది ఇన్నోవేషన్ కి దారితీస్తుందన్నారు. ఇన్నోవేషన్ అనేది తమ కంపెనీ అభివృద్ధికి అత్యంత కీలకమైనదని ప్రకటించారు. రూ.1200 కోట్ల పెట్టుబడి భారతదేశం పట్ల తమకున్న కమిట్‌మెంట్‌కు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తాము తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కంపెనీ తన లక్ష్యాలకు అనుగుణంగా కొనసాగుతుందన్నారు. రోగుల బాధను దూరంచేసి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న తమ కంపెనీ లక్ష్యాలతోపాటు ఆరోగ్య రంగాన్ని మరింతగా విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఈ భాగస్వామ్యం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను మెడ్ ట్రానిక్స్ కంపెనీకి వివరించారు. ముఖ్యంగా మెడికల్ డివైస్ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలను విపులంగా వెల్లడించారు. తన అమెరిక పర్యటనలో కంపెనీ చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా ఒమర్‌కు అభినందనలు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో పాటు జెఫ్రీ, యస్. మార్తా కంపెనీ నూతన సిఇఒగాగా ఎంపిక అయినందుకు అభినందనలు తెలియజేశారు. మెడ్ ట్రానిక్స్ కంపెనీ హైదరాబాద్ నగరాన్ని తమ అతిపెద్ద ఆర్ అండ్ డి సెంటర్ కి గమ్యస్థానం ఎంచుకోవడం పట్ల ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పనతో పాటు,ఈ రంగంలో మరిన్ని నూతన పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెడ్ ట్రానిక్స్ పెడుతున్న పెట్టుబడి హైదరాబాద్ నగరాన్ని భారతదేశ మెడికల్ డివైసెస్ హబ్ గా మారుస్తుందన్నారు.మెడ్ టెక్ రంగ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఇందుకు మెడ్ ట్రానిక్స్‌తో జరుగుతున్న ఒప్పందం ఇందుకు నిదర్శమన్నారు. మెడికల్ డివైసెస్ కంపెనీలతో కలిసి పనిచేస్తూ ప్రపంచ ఆరోగ్య రంగంలో సానుకూల మార్పు దిశగా పని చేస్తామన్నారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార ధోరణులను పరిశీలించినప్పుడు భారతదేశానికి ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కంపెనీ యొక్క భారత ఉపఖండ ఉపాధ్యక్షుడు మదన్ కృష్ణ మాట్లాడుతూ, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న రోగులకు తమ కంపెనీ యొక్క ఆవిష్కరణ ద్వారా ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో కంపెనీ ఇన్నోవేషన్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ప్రస్తుతం తాము చేస్తున్న ఈ పెట్టుబడి ద్వారా హెల్త్‌కేర్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాల విస్తరణ ద్వారా ఇక్కడి ఇంజనీరింగ్ విద్యార్థులు తమ మెడ్ ట్రానిక్స్ కంపెనీతో కలిసి పని చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. తద్వారా హెల్త్‌కేర్ రంగంలో అనేక మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉందన్నారు. తమ విస్తరణ ద్వారా భారతదేశ మెడికల్ డివైసెస్ ఇన్నోవేషన్ ఇకో సిస్టం బలోపేతం చేసేందుకు కూడా ఉపయోగపడుతుందన్న అభిలాష వ్యక్తం చేశారు.

Medtronic’s Rs.1200 cr Investment in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News