హైదరాబాద్: రాష్ట్రంలో రేపు మెట్రో రైళ్లు, ఆర్టీసి బస్సులను బంద్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించి కరోనాపై పోరాటం చేయాలని ప్రధాని మోడి పిలుపు మేరకు సిఎం కెసిఆర్ రాష్ట్రంలో 24 గంటలపాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రేపు(ఆదివారం) నగంరలోని మెట్రో రైళ్లు నడువవని.. అత్యవసరం కోసం ఐదు రైళ్లు ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఒక్క ఆర్టీసి బస్సు కూడా నడువొద్దని, పక్క రాష్ట్రాల బస్సులను కూడా రానియమని తెలిపారు. వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని.. పాలు, మందులు, ఆంబులెన్స్, ఫైర్ సర్వీస్, ఆస్పత్రులు.. అత్యవసర సేవలు మాత్రమే రేపు యథావిధంగా తెరవాలన్నారు. ఆలయాల్లో ఎక్కడ పూజలు బంద్ చేయలేదన్నారు. మహారాష్ట్ర సరిహద్దును ఒకటిరెండు రోజుల్లో మూసేస్తామని, జబ్బు వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకుంటాం పేర్కొన్నారు. రేపు ఒక్కరోజు ఇండ్లల్లో పనిమనుషుల కోసం చూడకండని.. కూలీలు, కార్మికులు కష్టమనుకోకుండా ఇంట్లోనే ఉండి 24 గంటలు జనతా కర్ఫ్యూ పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు.
Metro Rails and RTC Buses not run tomorrow: CM KCR