Sunday, April 28, 2024

నిర్మలమ్మా ఇన్ని అబద్దాలా: మంత్రి నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

minister niranjan reddy fires on nirmala sitharaman

హైదరాబాద్: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. మంత్రి సింగిరెడ్డి కేంద్రం, నిర్మలా సీతారామన్ పై ఫైర్ అయ్యారు. రైతుల పట్ల మోడీది అంకితభావమా ? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ హామీ ఏమయింది ? రైతుల సాగు పెట్టుబడిని రెట్టింపు చేసింది నిజం కాదా? ఎరువులు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి రైతుల నడ్డి విరిచారు. ఎరువుల ధరలు పెంచింది మీరు కాదా ? అని ఆయన ప్రశ్నించారు. రూ.1200 డీఎపీ రూ.1900, రూ.850 ఎంవోపీ (పొటాష్) రూ.1700, రూ.1200 ధర ఉన్న 24.24.0.18 ని రూ.1900కు పెంచారని తెలిపారు. తొమ్మిది విడతలలో 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.57,880 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమచేయడం జరిగిందన్నారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి మూడు విడతల్లో ఇచ్చే ఆరు వేలు అందేది 33 లక్షల మంది రైతులకే, రైతుభీమా పథకం కింద 86,667 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4333.35 కోట్ల పరిహారం అందిందన్నారు. ఉచిత కరెంట్, సాగునీటితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు అనుకూల విధానాలతో తెలంగాణ రైతులు దేశంలో అత్యధికంగా వరి ధాన్యం పండిస్తే రాజకీయ కక్ష్యతో తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తానన్న మోడీ అధికారం దక్కాక దాని ఊసెత్తడం లేదని గుర్తుచేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తామని మోసం చేశారు. పండిన పంటలలో కేవలం 25 శాతం మాత్రమే మద్దతు ధరలకు కొనుగోలు చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు.

నల్లచట్టాలు తెచ్చింది మోడీ కాదా ? రైతుల ఉద్యమం మీద ఉక్కు పాదం మోపింది మోడీ కాదా ? రైతుల నిరసనకు జడిసి క్షమాపణ చెప్పి చట్టాలు రద్దు చేస్తున్నట్లు చెప్పింది మోడీ కాదా ? రద్దు చేసిన సంధర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నది మోడీ కాదా ? 60 ఏండ్లు నిండిన ప్రతి రైతుకు ఫించన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మాట వాస్తవం కాదా ? భారీ వర్షాలు తెలంగాణ, గుజరాత్ ను ముంచెత్తితే గుజరాత్ నిధులిచ్చి తెలంగాణకు ఇవ్వకుండా వివక్ష చూపింది నిజం కాదా ? అన్నారు. తెలంగాణ ఎంతో చైతన్యవంతమైన నేలని మంత్రి పేర్కొన్నారు. ఈ నేల మీద అబద్దాలతో ప్రజలను ఏమార్చవచ్చని ఆశించడం హస్యాస్పదమన్నారు. తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలు దేశంలోని ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా అమలవుతున్నాయా ? మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News