Thursday, May 16, 2024

చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి ఫైర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చంద్రబాబు హైదరాబాద్‌లో ప్రారంభించినప్పుడు ఆయన చేసిన పలు వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న చంద్రబాబు కామెంట్స్‌పై సింగిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. జొన్నకలి, జొన్నయంబలి, జొన్న అన్నం, జొన్న పిసరు, జొన్నలెతప్పన్, సన్న అన్నం సున్న సుమీ వంటి ఆంధ్ర ప్రాంతం ఆహారం గురించి మహాకవి శ్రీనాథుడు (1365 నుంచి1441) ఆరు శతాబ్దాల క్రితమే రాశారని మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు.

11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించబడిన గొలుసుకట్టు చెరువుల కింద వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు తెలంగాణ ప్రసిద్ధి అని సింగిరెడ్డి ప్రస్తావించారు. ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానం అందించిన నేల తెలంగాణ అని, అప్పట్లోనే విష్ణు కుండినుల నుంచి కాకతీయులు, ఆ తదుపరి నిజాంల దాక గొలుసు కట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయ వృద్ధి కోసం బాటలు వేశారని మంత్రి నిరంజన్ రెడ్డి కొనియాడారు. 15వ శతాబ్ధం నుంచి హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి అని, బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమంలో అనేక సార్లు ప్రస్తావించారని మంత్రి సింగిరెడ్డి స్పష్టం చేశారు.
అక్కసు, అక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయం కారణంగా….
అక్కసు, అక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయం కారణంగా తెలంగాణ ఉద్యమానికి పునాది పడిందని మంత్రి సింగిరెడ్డి తెలిపారు. 1956లో ఆంధ్రలో తెలంగాణ విలీనమే తెలంగాణ ప్రాంతం వినాశనానికి బీజం పడిందని సింగిరెడ్డి చెప్పారు. చెరువులు, కుంటలను ధ్వంసం చేశారని, అప్పటికే ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆక్షేపించారు. దశాబ్ధాలపాటు ప్రాజెక్టుల నిర్మాణం సాగదీశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు కట్టిన ఒక్క ప్రాజెక్టు మళ్లీ తెలంగాణ ఏర్పాటు వరకు నిర్ణీత లక్ష్యానికి సాగు నీరందించిన దాఖలాలు లేవని మంత్రి ఆరోపించారు.

ప్రాజెక్టులు కడుతున్నట్లు, సాగునీరు ఇస్తున్నట్లు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారని, వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్య పాలనలో చెల్లాచెదురు చేశారని మంత్రి విమర్శించారు. గ్రామాల్లో ఉపాధి కరువై ముంబై, దుబాయి బాట పట్టేలా చేయడమే కాకుండా ఆఖరుకు రూ.2కు కిలో బియ్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే దుస్థితికి తీసుకువచ్చారని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News