హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ దేశవ్యాప్తంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు విశేష ఆదరణ లభిస్తోంది. పచ్చదనం కంటికి ఆహ్లాదాన్నిచ్చి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుందని చిలకలూరిపేట ఎంఎల్ఎ విడదల రజని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రోజావనం సంయుక్తంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలోని తన నివాసంలో మంగళ వారం ఆమె మొక్కలు నాటారు.
మొక్కలను పెంచుతున్నాం అంటే భౌగోళిక వెచ్చదనాన్ని తగ్గిస్తున్నాం అని అర్థమని తెలిపారు. మొక్కలు నాటడానికి ఖాళీ స్థలం లేదనే ప్రసక్తే లేదని.. ఇంట్లో ఉన్న పాత డబ్బాలు, విరిగిపోయిన మగ్లను ఉపయోగించి కూడా మొక్కలను పెంచవచ్చని పట్టణ ప్రాంతాల్లో నివాసముండేవారిని కోరారు. చెట్లు మానవునికి కావాల్సిన ప్రాణవాయువైన ఆక్సిజన్ను ఇచ్చి కార్బన్డైఆక్సైడ్ను పీల్చుకుంటాయన్నారు. కార్యక్రమంలో ప్రముఖులను భాగస్వాములను చేస్తున్న ఎంపి జోగినపల్లి సంతోష్కుమార్, ఎంఎల్ఎ రోజాకు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
గ్రీన్ఛాలెంజ్ గొప్ప స్పూర్తిదాయకం
-పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అది అందరి అభిమతంగా ముందుకు సాగినప్పుడే గ్రీన్ ఛాలెంజ్, హరితహారం వంటి గొప్ప కార్యక్రమాల లక్షం నెరవేరుతుందని నల్లగొండ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎంవి రంగనాధ్ పేర్కొన్నారు. గ్రీన్ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ బృహత్తరంగా చేపట్టిన గ్రీన్ఛాలెంజ్లో భాగంగా ఎస్పీ రంగనాధ్ స్నేహితుడు, వెల్స్ ఫర్గో సంస్థ అధినేత శ్రీదర్ చుండూరి విసిరిన గ్రీన్ఛాలెంజ్ను స్వీకరించి అందులో భాగంగా మంగళవారం నల్లగొండ పోలీస్ కార్యాలయంలో మూడు రకాల పండ్ల మొక్కలను నాటి ఆ వెంటనే నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్చోడగిరి,నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్రెడ్డిలకు గ్రీన్చాలెంజ్ను విసిరారు. ఈ సందర్బంగా ఎస్పీ రంగనాద్ మాట్లాడుతూ సమాజహితం కోసం కేవలం మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోవద్దని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకున్నప్పుడే లక్షం నెరవేరుతుందని వివరించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం, గ్రీన్ఛాలెంజ్ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళాలని కోరారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో పర్యావరణాన్ని స్వీకరించే విదంగా ఇప్పటికే అదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో గ్రీన్ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించిన నల్లగొండ ఎస్పీ రంగనాద్కు ఎంపి సంతోష్కుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ సంక్షిప్త సమాచారం పంపించారు. కార్యక్రమంలో డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, డిఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాంచందర్గౌడ్, చండూరు సిఐ సురేష్కుమార్, టాస్క్ఫోర్స్ సిఐ నాగేశ్వర్రావు, ఆర్ఐలు ప్రతాప్, నర్సింహాచారి, స్పర్జన్రాజ్, కళ్యాణ్రాజ్, అశోక్, ఎఆర్ ఎస్ఐలు అస్సార్అలీ, వెంకటరాజు, టాస్క్ఫోర్స్ ఎస్ఐ శివ, తెలంగాణ జాగృతి అధ్యక్షుడు భోనగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.