Monday, May 6, 2024

వేధింపులకు గురిచేసే నైజం బిజెపిది: ఎంఎల్ఎ సంజయ్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ప్రతిపక్ష పార్టీల నాయకులను తన జేబు సంస్థలైన ఈడి, సిబిఐలతో వేధించే నైజం బిజెపికి ఉందని తనపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాదారమైనవని ఎదుటి మనిషికి నష్టం చేయాలని కలలోను తలచుకొనని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడారు. బిజెపి నాయకులు పన్నాల తిరుపతి రెడ్డిపై అక్రమ కేసులు పెట్టించానని తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నానన్నారు. తాను ఎదుటి వ్యక్తికి నష్టం చేయాలని ఏనాడు భావించనని తన ఫ్లెక్సీలను కాల్చివేసినా కేసు పెట్టలేదన్నారు. ఇదంతా ఎంపి అర్వింద్ డైరెక్షన్ లో ఆడిన నాటకమన్నారు.

వాజ్ పాయ్ కాలం నాటి బిజెపికి నేటి బిజెపికి ఎంతో తేడా ఉందని ఇప్పుడంతా ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురిచేసే బిజెపి ఉందన్నారు. అత్యున్నత చట్టసభ పార్లమెంట్ సభ్యుడైన అర్వింద్ మాట్లాడే భాష సరిగా లేదని రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తని వారి తండ్రి కూడా ఏనాడు ఇంత నీచంగా మాట్లాడలేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి బిజెపి నాయకుడు తిరుపతి రెడ్డి పై నేను రాజకీయాల్లోకి రాకముందే ఎన్నో కేసులున్నాయని ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నా అప్పటి కాంగ్రెస్ నాయకుల సహకారంతో మరుగున పడిందన్నారు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని పోలీసు వాహనంపై ఎక్కి నష్టం చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అలాగే ఒక పోలీసు అధికారి చొక్కా పట్టుకొని నూకేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటన అందరికి తెలుసన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తిరుపతిరెడ్డి రాజకీయంగా విభేదిస్తున్నా ఏనాడు పతిట్టించుకోలేదని ఎమ్మెల్యే అన్నారు.

పరామర్శకు వచ్చిన అర్వింద్ పక్కన, వెనక ఉన్నోళ్లపై భూకబ్జా, క్రిమినల్ కేసులున్నాయని ఇదే ఆరోపణలు బిజెపిలోకి చేరక ముందు మీ పార్టీవాళ్లే ఆరోపించారన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని తన జీవితం తెరిచిన పుస్తకమన్నారు. నేను ఏనాడు పట్టించుకోలేదని పట్టించుకుంటే కొందరైనా జైలుకు పోయేవారన్నారు. తనకు ఎప్పుడు అలాంటి ఆలోచనలు రావని తనపై చేసిన ఆరోపణలన్ని నిరాదారమని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల కు వచ్చిన ఎంపి అర్వింద్ తాను జగిత్యాల జిల్లా కు చేసిన అభివృద్ధి ఏందో చెప్పడం మానేసి అనవసర నీచ, అబద్ధపు రాజకీయాలకు తెరలేపడం సరికాదన్నారు. జనవరి 26 నే అర్వింద్ డైరెక్షన్ లో ఆడిన నాటకాన్ని జగిత్యాల ప్రజలు గమనించారని ఎమ్మెల్యే చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్న కేంద్రంలోని బిజెపి పార్టీపై సిఎం కెసిఆర్ చేస్తున్న విమర్శలతో పాలుపోక బిజెపి ప్రభుత్వం కవితక్కపై అక్రమ కేసులు పెట్టి ఈడితో వేధింపులకు గురిచేస్తోదని ఎమ్మెల్యే అన్నారు.

సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ఆలోచనగా పనిచేస్తున్నదని ఇలాగే బిఆర్ఎస్ మంత్రులు,ఎమ్మెల్యేలు, నాయకుల ఆలోచన ఉంటుందని, సంక్షేమ ఫలాలు అందరికి అందాలని శాంతియుత వాతావరణం అన్నిచోట్ల ఉండాలని కోరుకుంటామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. దయతో జగిత్యాల బిజెపి నాయకులను కోరుకుంటున్నానని ఇంతవరకు ఇక్కడ లేని నీచ అబద్ధపు సంస్కృతిని జగిత్యాలలో ప్రవేశపెట్టోదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు సతీష్, దావా సురేష్, బాల ముకుందం, బాలే శంకర్, అడువాల లక్ష్మణ్, కూతురు శేఖర్ తోపాటు పలువురు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News