Saturday, April 27, 2024

పేద, మధ్యతరగతి జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్న మోడీ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ

హైదరాబాద్ : అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు కట్టడి చేయడంలో ఫుర్తిగా విఫలమై మోడీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి జీవితాలను దుర్భరంగా మార్చేస్తోందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ ఆరోపించారు. లీటర్ పెట్రోల్ రేటుకంటే కంటే కిలో టమాటా రేటు ఎక్కువ కావడం ఆందోళనకరమన్నారు. శ్రీలంక, పాకిస్థాన్ తరువాత ఇప్పుడు భారత దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు విధానాల వల్లే అన్ని వస్తువుల ధరల పరిస్థితి క్రమంగా దిగజారు తోందని ఆమె విమర్శించారు.

రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల, కూరగాయల అధిక ధరలను కట్టడి చేయాలనీ డిమాండ్ చేస్తూ భారత జాతీయ మహిళా సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్, హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద సోమవారం వినూత్న ప్రదర్శన నిర్వహించింది. కూరగాయల హారాలను ధరించి, ప్లకార్డులు చేతబూని పెరిగిన వంట గ్యాస్, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను అదుపు చేయాలనీ డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా పశ్య పద్మ హాజరై మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతను నిర్దారిస్తున్న వ్యవసాయ రంగాన్ని బలోపితం చేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని, దింతో రానున్న రోజుల్లో దేశంలో మిలియన్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జారిపోవచ్చునని తెలిపారు.

కూరగాయల కృత్రిమ ధరల పెంపుతో రైతులు, వినియోగదారులు ఇరువురూ దోపిడీకి గురైతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న జీవన వ్యయంతో జీవనం సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, పెరిగిన నిత్యావసర వస్తువుల, కూరగాయల ధరలను అదుపులోకి తీసుకవచ్చి జనాలకు ఉపశమనాన్ని అందించాలని పశ్య పద్మ డిమాండ్ చేశారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ సీనియర్ నాయకురాలు పి.ప్రేమ్ పావని మాట్లాడుతూ ఇంటి బడ్జెట్ కూరగాయలు కొనడానికి సరిపోతుందని, నిరంతరంగా పెరుగుతున్న అధిక ధరలతో ప్రతి గృహిణి కన్నీటి పర్యంతమైతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలు ప్రజలను మళ్లీ దారిద్య్ర రేఖకు దిగువన నెట్టివేస్తున్నాయని ఆమె విమర్శించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు అత్యంత ఖరీదైనవిగా మారడం భారీ ప్రజా ఆందోళనకు గురిచేసే అంశం అని, ప్రధాని మోడీ స్పందించకుండా విచిత్రంగా మౌనం వహించడం దుర్మార్గమన్నారు. ప్రతి వస్తువుపై జిఎస్‌టి విధించి ప్రజలను మోడీ ప్రభుత్వం దోచుకుంటుందని ఆమె దుయ్యబట్టారు. ప్రధాని మోడీ మౌనం విడి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను తగ్గించేందుకు తక్షణమే చెర్యలు చేపట్టాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ప్రేమ్ పావని హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఉస్తెల సృజన, నేదునూరి జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఎస్. ఛాయాదేవి, సహాయ కార్యదర్శి నళిని, కార్యవర్గ సభ్యురాలు ఫైమీద, జె. లక్ష్మి, హైదరా బాద్ జిల్లా అధ్యక్షురాలు పడాల నళిని, ఉపాధ్యక్షురాలు షహనా అంజుమ్, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నండూరి కరుణ కుమారి పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News