Thursday, May 9, 2024

నెల రోజులు 8 కోట్లకు పైగా మహిళల ప్రయాణం

- Advertisement -
- Advertisement -

మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసి బస్సులో మహిళల కోసం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మంగళవారంతో 30 రోజులు పూర్తి చేసుకుంది. గతేడాది డిసెంబర్ 09వ తేదీన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో ఈ పథకాన్ని ప్రారంభించగా డిసెంబర్ 15వ తేదీ నుంచి ఆర్టీసి సిబ్బంది జీరో టికెట్స్ జారీ చేస్తున్నారు. ఈ పథకంతో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగిందని బస్సుల్లో ఆక్యుపెన్సీ 69 శాతం నుంచి 88 శాతానికి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా రోజుకు దాదాపు 27 లక్షల మంది మహిళలు జర్నీ చేస్తుండగా ఈ నెల రోజుల్లో 8 కోట్లకు పైగా మహిళలు ప్రయాణించినట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
జీరో టికెట్ లేకపోతే రూ. 500లు జరిమానా
మరోవైపు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళల పాలిట వరంగా మారిందని ఆర్టీసి ఎండి సజ్జనార్ చెప్పారు. ఉచిత బస్సు సర్వీసును ఉపయోగించుకుని చాలా మంది మహిళలు హైదరాబాద్ నగరంలో మెరుగైన వైద్యం కోసం తరలి వస్తున్నారని ఈ విషయం ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో వెల్లడైనట్లు ఆయన వెల్లడించారు. గతంలో ప్రయాణ ఛార్జీల భారంతో హైదరాబాద్‌కు చికిత్స నిమిత్తం రాలేక స్థానికంగానే వైద్యం చేయించుకున్న మహిళలు ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో నగరంలోని ఆసుపత్రులకు వచ్చి చికిత్స తీసుకోవడం అభినందనీయమని ఆయన తెలిపారు. అయితే జీరో టికెట్ తీసుకొని మహిళా ప్రయాణికులు చెకింగ్‌లో దొరికితే ఫైన్ కింద రూ.500లను చెల్లించాలని ఆయన సూచించారు. మహిళలు కచ్చితంగా ఒరిజినల్ కార్డును చూపించి జీరో టికెట్ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News