కేంద్రంతో శాంతి చర్చలకు సుముఖత
కోహిమా: నికీ సుమీ నేతృత్వంలోని నాగా మిలిటెంట్ సంస్థ ఎన్ఎస్సిఎన్కె కాల్పుల విరమణ ప్రకటించింది. తమ సంస్థ నేతలు కేంద్ర అధికారులతో శాంతి చర్చలు జరుపుతున్నారని నికీ సుమీ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. 2001లో కేంద్రంతో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసిన ఈ సంస్థ 2015లో ఏకపక్షంగా ఉల్లంఘించింది. 2015లో మణిపూర్లో సైనికులపై దాడి జరిపి 18మందిని పొట్టన పెట్టుకున్నది. ఆ కేసులో సుమీ ప్రధాన నిందితుడు. సుమీపై ఎన్ఐఎ రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.
నాగా సమస్యకు అంతిమ పరిష్కారం కనుగొనేందుకు భాగస్వామ్య పక్షాలన్నిటితోనూ చర్చిస్తామని కేంద్రం ఇటీవల చేసిన ప్రకటనలకనుగుణంగానే తామీ నిర్ణయం తీసుకున్నామని సుమీ పేర్కొన్నారు. మయన్మార్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న చిట్టచివరి గ్రూప్ ఇదేనని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ గ్రూప్తో చర్చలు నాగా సమస్య శాంతియుత పరిష్కారానికి దోహదం చేస్తాయని ఆ అధికారి అన్నారు. 2015,ఆగస్టు 3న నాగాల మరో గ్రూప్ ఎన్ఎస్సిఎన్ఐఎంతో కేంద్రం ఓ ఒప్పందం కుదుర్చుకున్నది. శాశ్వత పరిష్కారం దిశగా ఓ ఫ్రేమ్వర్క్ను రూపొందించిన ఆ ఒప్పందం ప్రధాని మోడీ సమక్షంలోనే జరిగింది. ఆ తర్వాత ఐఎం గ్రూప్ ప్రత్యేక నాగా జెండా, రాజ్యాంగాన్ని డిమాండ్ చేయడంతో ఆ ఒప్పందం అటకెక్కింది.