న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు తెలంగాణ నుంచి ఓ యువకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విషయం కాస్త ఆలస్యంగా వెల్లడైంది. ఓ యువతి పేరుతో నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్ను సృష్టించిన కేసులో నజీమ్(27) అనే యువకుడిని ఢిల్లీ పోలీసులు వికారాబాద్ జిల్లా తాండూర్ టౌన్షిప్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన దర్యాప్తు బృందం నజీమ్ను అరెస్ట్ చేసి స్థానిక కోర్టు అనుమతితో తీసుకెళ్లింది. యువతికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలను ఫేస్బుక్లోకి అప్లోడ్ చేసినట్టు కేసు నమోదైంది.
ఉత్తర్ప్రదేశ్ మురాదాబాద్ జిల్లాకు చెందిన నజీమ్ కొంతకాలం ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో ఉన్నాడు. ఆ సమయంలో సమీపంలో నివాసముంటున్న యువతితో పరిచయం పెంచుకొని, ఆమె పేరుతో ఫేస్బుక్ ఖాతాను ఓపెన్ చేశాడు. అందులోకి ఆమె ఫోటోలను అప్లోడ్ చేశాడు. ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చిన నజీమ్ ఇక్కడ బార్బర్గా పని చేస్తున్నాడు. ఇటీవలే ఈ ఫోటోల విషయాన్ని గుర్తించిన యువతి సోదరుడు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్ల క్రితం తాను 14 ఏళ్ల వయసులో ఉండగా నజీమ్ తన ఫోటోలు తీసినట్టు ఆ యువతి తన సోదరునికి వివరణ ఇవ్వడం గమనార్హం.