Monday, April 29, 2024

ఎల్గార్ పరిషద్ కేసులో నవ్‌లఖాకు బెయిల్

- Advertisement -
- Advertisement -

ఉత్తర్వుల అమలుపై 3 వారాల స్టే ఇచ్చిన బాంబే హైకోర్టు

ముంబై: ఎల్గార్ పరిషద్-మావోయిస్టుల సంబంధాల కేసులో హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోరుతూ నవ్‌లఖా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎఎస్ గడ్కరీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అనుమతించింది. అయితే తాము సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా బెయిల్ ఉత్తర్వుల అమలుపై ఆరువారాలపాటు స్టే ఇవ్వాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) అభ్యర్థించగా మూడు వారాల పాటు ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే మంజూరు చేసింది.

2018 ఆగస్టులో అరెస్టు అయిన నవ్‌లఖా ఆయనను హౌస్ అరెస్టులో ఉంచడానికి సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్‌లో అనుమతించింది. ప్రస్తుతం ఆయన నవీ ముంబైలో నివసిస్తున్నారు. రూ. 1 లక్ష పూచీకత్తుపై ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ పొందిన ఏడవ నిందితుడు ఆయన. నవ్‌లఖాకు బెయిల్ ఇవ్వడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. నవ్‌లఖాకు నిషిద్ధ మావోయిస్టు సంస్థ క్రియాశీల సభ్యుడని రుజువుచేసే ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నందున ఆయనకు బెయిల్ ఇవ్వలేమని ప్రత్యేక కోర్టు అప్పట్లో పేర్కొంది. హైకోర్టులో ఆయన అప్పీలు దాఖలు చేయగా బెయిల్ తిరస్కరణలో ప్రత్యేక కోర్టు పొరపాట్లు చేసిందని హైకోర్టు అభిప్రాయపడింది.

2017 డిసెంబర్ 31న పుణెలో జరిగిన ఎల్గార్ పరిషద్ సదస్సులో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారన్న ఆరోపణతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు కోరేగావ్-భీమా యుద్ధ స్మారకం వద్ద హింసాకాండ జరగడానికి ఈ ఉపన్యాసాలే కారణమని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో మొత్తం 16 మంది హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయగా వారిలో ఐదుగరు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మేధావి-కార్యకర్త ఆనంద్ తెల్‌తుంబడే, న్యాయవాది సుధా భరద్వాజ్, వర్మన్ గొంజాల్వేస్, అరుణ్ వఱ్రీరా, మహేష్ రౌత్‌కు రెడ్యులర్ బెయిల్ రాగా విప్లవ కవి వరవరరావు ఆరోగ్య కారణాలపై బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో నవ్‌లఖా. బెయిల్ పొందిన ఏడవ నిందితుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News