Saturday, April 27, 2024

దావూద్‌పై విషప్రయోగం నిజమేనా?

- Advertisement -
- Advertisement -

ఆ వార్తలలో నిజం లేదన్న దావూద్ అనుచరుడు చోటా షకీల్
దావూద్ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ మీడియా కథనాలు

న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో తన 68వ పుట్టినరోజును జరుపుకోనున్న పరారీలో ఉన్న తీవ్రవాది, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం కస్కర్ విషప్రయోగానికి గురై పాకిస్తాన్‌లోని కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెలువడిన వదంతులతో రాజకీయ వ్యవస్థలు, నిఘా విభాగాలు, దర్యాప్తు సంస్థలు, బారత్, పాకిస్తాన్‌లోని మీడియా ఉలికిపాటుకు గురికాగా దావూద్ అనారోగ్యానికి సంబంధించిన వార్తలను ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా ఖండించింది. దావూద్ ఇబ్రహిం సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నాడని అతని సన్నిహిత అనుచరుడు చోటా షకీల్‌ను ఉటంకిస్తూ ఆ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది.

దావూద్‌పై విషప్రయోగం జరిగినట్లు వచ్చిన వార్తలు సోషల్ మీడియాతోపాటు ప్రధాన స్రవంతి మీడియాలో సైతం సంచలనాన్ని రేపాయి. అయితే ఈ కథనాలలో అనేక లోపాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దావూద్ కరాచీలో నివసిస్తున్నాడని, అతనిపై గుర్తు తెలియని వ్యక్తి ఒకరు విషప్రయోగం జరిపాడని, విషమ పరిస్థితిలో ఉన్న దావూద్‌ను ఆసుపత్రికి తరలించారని సోమవారం కొన్ని కథనాలు వెలువడ్డాయి. కొందరు సోషల్ మీడియా యూజర్లయితేదావూద్ మరణించినట్లు ప్రకటించిన పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ఉల్ హఖ్ కక్కర్ ఎక్స్ అకౌంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి పోస్ట్ చేశారు. అయితే ఇది ఫేక్ అకౌంట్ అని తేలిపోయింది. ఆ మెసేజ్‌లో ఇలా ఉఆసి ఉంది: మానవత్వానికి దైవదూత, ప్రతి పాకిస్తానీ పౌరుడికి ఆత్మీయుడు, మా ప్రియతముడు దావూద్ ఇబ్రహిం గుర్తు తెలియిని వ్యక్తి విషప్రయోగం జరపడంతో మరణించాడు.

కరాచీలోని ఆసుపత్రిలో అతను తుదిశ్వాస విడిచాడు. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అంటూపాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని సంతాపం ప్రకటించినట్లు ఒక పోస్టు సోషల్ మీడియాలో వెలువడింది. ఊహాగానాల ఆధారంగా రాసిన మరో వార్తా కథనంలో 67 ఏళ్ల దావూద్ ఇబ్రహిం కరాచీలో తన రెండవ భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడితో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య, ప్రజల కంటపడకుండా నివసిస్తున్నాడని పేర్కొన్నారు. అంతేగాక దావూద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిని పటిష్టమైన భద్రతా సిబ్బంది కాపలాకాస్తున్నారని కూడా పేర్కొన్నారు. దావూద్‌పై వస్తున్నవి నిరాధార కథనాలని స్పష్టం చేయాలంటే మొందుగా చెప్పవలసింది పాకిస్తాన్ ప్రభుత్వ ఖండన. దావూద్ ఇబ్రహిం కరాచీలోనే కాదు..తమ దేశంలో ఎక్కడా లేడని పాకిస్తాన్ అధికారికంగా ఖండించింది.

ఈ కారణంగా దావూద్‌పై వచ్చిన కథనాలలోని నిజానిజానిజాలు బయటి ప్రపంచానికి తెలియవు. ఒకవేళ ఆ వదంతిలో నిజం ఉందని భావించినా వాస్తవ పరిస్థితులను గమనంలోకి తీసుకుంటే అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నివసిస్తున్న అంగర్‌వరల్డ్ డాన్ దావూద్‌కు ఒక గుర్తు తెలియని వ్యక్తి విష ప్రయోగం చేయగలడా అన్నది అనుమానమే. అత్యంత నమ్మకమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులు, సన్నిహిత అనుచరులు, భద్రతా సిబ్బంది మధ్య సురక్షితంగా ఉన్న దావూద్ వద్దకు వెళ్లడం మూడో వ్యక్తికి ఎలా సాధ్యమవుతుందని ఆ ఇంగ్లీష్ మీడియా సందేహాన్ని కథనంలో వ్యక్తం చేసింది.

ఇప్పుడు 67 ఏళ్ల వయసులో ఉన్న దావూద్ వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలు లేవని ఆ పత్రిక పేర్కొంది. దావూద్‌పై ఇండియాలో అనేక కేసులు నమోదై ఉన్నాయి. ఉగ్రవాద కార్యకలాపలు, డ్రగ్స్ మాఫియాతోసహా అనేక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న దావూద్‌ను పరారీలో ఉన్న తీవ్రవాదిగా భారత ప్రభుత్వం పరిగణిస్తోంది. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో దావూద్ ప్రధాన నిందితుడు. ఈ పేలుళ్లలో 267 మంది అమాయక ప్రజలు మరణించారు. అదే విధంగా 2008 నవంబర్ 26న ముంబైలో 266 మంది మరణానికి కారణమైన ఉగ్ర దాడులలో కూడా దావూద్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News